పాపం.. ఆ చిన్ని ఉడుత..!!

నేను అమెరికాలో చూసినన్ని ఉడుతలు ఇండియాలో ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఉద్యానవనాలు, సహజ సిద్ధమైన వనాలు, విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉండడం వల్లనేమో ఉడుతల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తరచుగా ఇలాంటి ఉడుతలు పొరపాటునో, ఆహారాన్వేషణలోనో వాహనాలు తిరిగే రోడ్లపైకి రావడం, రివ్వున దూసుకుపోయే ఏ కారు చక్రాల కిందో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. నేనూ, నా భార్యా ఏ పని మీద బయటకు వెళ్ళినా, ఎక్కడో ఒక చోట ఇలా చనిపోయిన ఉడుతను చూడడం, దాని అల్పాయుష్షును తలచుకొని బాధ పడడం, అతి వేగంతో వాహనాన్ని నడిపిన వాడిని తిట్టుకోవడం మామూలయిపోయింది. ఎప్పుడు కారు నడిపినా ఏ మూలనుంచో ఏ ఉడతో, పిల్లో కారుకి అడ్డం పడుతుందేమోనని అతి జాగ్రత్తగా కారు నడపడం, ఒక్కోసారి హఠాత్తుగా కారును పక్కకి తిప్పి తప్పించడం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.

ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఉగాదినాడు జరిగిన సంఘటన మా హృదయాలను కలచి వేసింది. నేను ప్రతి రోజూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళడం అలవాటు. అలాగే ఉగాదినాడు కూడా ఇంటికి వచ్చి, భోజనం పూర్తి చేసుకొని మరల ఆఫీసుకు బయలుదేరాను. మా గృహసముదాయం దాటగానే రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుకొనేందుకు కొన్ని పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ నిండుగానే ఉంటూంటాయి. వాటి మధ్యగా నేను కారును పోనిస్తూండగా ఎక్కడినుంచో ఒక ఉడుత ఆ నిలిపిఉన్న కార్ల మధ్య నుంచి రోడ్డు మీదకి ఒక్కసారి దూకి నా కారుకు అడ్డుపడింది. అక్కడ వేగ పరిమితి 25 మైళ్ళు ఉంటుంది. నేను దాదాపుగా అదే వేగంతో ప్రయాణిస్తున్నాను. అనుకోకుండా అడ్డుగా ఉడుత కనపడడంతో, దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు స్టీరింగును పక్కకు తిప్పాను. నా కారు ముందు చక్రాలు రెండూ ఉడుతను దాటేయడంతో, ఇక దాని ప్రాణానికి ముప్పు తప్పిందని సంతోషించి ఒక్క సెకను కూడా గడిచిందో లేదో, నా కారు వెనుక చక్రం దేని మీదో ఎక్కడం, ఒక చిన్ని శబ్దం వినిపించడం జరిగింది. ఒక్కసారి కారు బ్రేక్ వేసి వెనుకకు చూసేసరికి ఆ ఉడుత నా కారు వెనుక చక్రాల కింద పడి చనిపోయిఉంది. అంత బరువైన కారు, అంత అల్ప ప్రాణి మీదుగా వెళ్తే ఎక్కడ తట్టుకోగలదు..? అప్పటివరకూ చెంగు చెంగు మంటూ పరుగెత్తిన ఆ ఉడుత ఒక్క క్షణంలో విగతజీవి కావడం, అదీ దాని ప్రాణం పోవడానికి నేను కారణం కావడం ఎంతో బాధను కలిగించింది. ఇందులో నా తప్పు లేకున్నా, నావంతు ప్రయత్నం నేను చేసినా, దానిని కాపాడలేక పోయానే అన్న క్షోభను, మనస్తాపాన్ని రోజంతా అనుభవిస్తూనే ఉన్నాను. జరిగిన విషయం తెలిసిన నా భార్య కూడా కన్నీరు కార్చింది. ఇద్దరం కలసి శ్రీనివాసునికి నమస్కరించి ఆ ఉడుత ఆత్మశాంతికై ప్రార్థించాము.

2008 మధుర జ్ఞాపకాలు – 1

దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా.. కొత్తసంవత్సరం వచ్చిన రెండు నెలలకు గత సంవత్సర జ్ఞాపకాలంటాడేమిటి అని ఆశ్చర్యపోకండి. ఇన్నాళ్ళ నా బ్లాగ్నిశబ్దానికి కారణాలు అవే..!!

2007 లో నేను మా నాన్నగారికీ, అక్కకీ కట్టించిన ఇళ్ళ గృహప్రవేశాలు అయినట్టుగా నా గత బ్లాగు “నెరవేరిన నా జీవిత ఆశయం” లో తెలియపరచాను. అప్పటివరకూ అమెరికాలో సొంత ఇంటిగురించి కనీసం ఆలోచనైనా చేయని నాకు, బాధ్యతలు కొంతవరకూ తీరడంతో, నెమ్మదిగా ఆ కోరిక పుట్టింది. 2007 డిశంబరు నెలలో సొంత ఇంటికై ప్రయత్నాలు మొదలు పెట్టాను.

ముందుగా నా మరియు నా భార్య మనస్తత్వాన్ని బట్టీ, నా అన్వేషణకు పరిమితులు విధించుకొన్నాను. అప్పటికి ఆరేళ్ళుగా, మా కంపెనీకి రెండు మైళ్ళ దూరంలోనే ఉన్న అపార్టుమెంటులోనే నివసిస్తూ ఉండడం వల్ల, ప్రతీ రోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, వేడి వేడిగా భోచేసి, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళడం అలవాటయిపోయింది. నా భార్యకు కూడా, పొద్దున్నే లేచి వంట చేయడమో, ముందు రాత్రే మర్నాటికి సరిపడా వండి వుంచడమో లాంటి శ్రమ ఉండేది కాదు. అందులోనూ మధ్యాహ్నం ఒకసారి నేను రావడం వల్ల తనకీ పొద్దుటినుంచీ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న భావనా కలిగేది కాదు. అంతే కాక, నాకు ఎక్కువసేపు కారు డ్రైవ్ చేయాలన్నా చిరాకు, అసహనం వచ్చేస్తుంది. అందువల్ల ముందుగా మేము విధించుకొన్న పరిమితి: సొంత ఇల్లు కంపెనీకి దగ్గిరగా ఉండాలి అని.  ఇక మాఇద్దరి మనస్తత్వాల ప్రకారం, ఇంట్లో ఏదైనా చిన్నా చితకా రిపేర్లు వస్తే సొంతంగా చేసుకోగలిగే ఓపికా, సహనం లేవు. అందువల్ల పాత ఇంటిని కొని మా సామర్థ్యాన్ని పరీక్షించుకొనే కన్నా, కొత్త ఇంటినే తీసుకొంటే ఈ తలనొప్పులేవీ ఉండవని ఒక తెలివైన (?) ఆలోచన చేశాము. ఇక ఆరేళ్ళుగా అపార్ట్‌మెంటు జీవితానికి అలవాటు పడ్డ ప్రాణాలేమో, పెద్దగా, విశాలంగా, ఒక దానికి ఒకటి దూరంగా విసిరేసినట్లుండి, పక్కింటి వాడిని చూడడానికే మొహం వాచిపొయే ఇళ్ళవంక కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకొన్నాం. ఇక స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, క్లబ్ హవుసులు ఉన్న ఇళ్ళ సముదాయమైతే బహు బాగు అని అనుకున్నాం.

మా ఈ పరిమితులకు సరిపడే ఇళ్ళ సముదాయాలు ఒక రెండు కనిపించాయి. వాటిలో ఒక దాని నిర్మాణం అప్పుడే ప్రారంభించడం వల్ల ఇంకా మొదటి విడత ఇళ్ళనే అమ్మకానికి పెట్టారు. మరో రెండు సంవత్సరాల వరకూ అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఆ పనులకు సంబంధించిన వాహనాల రొదతో రోజూ సుప్రభాతం పాడించుకొనే కోరిక లేక, రెండవ సముదాయమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అప్పటికే ఆ సముదాయ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యి, చివరి విడత అమ్మకాలు సాగుతున్నాయి. మాకు అందుబాటులో ఉన్న రెండు మూడు ఇళ్ళ ప్లానులు, వాటి ప్రధాన ద్వార దిశ మొదలైనవి పరిశీలించి, తూర్పు దిశగా ఉన్న ఒక ఇంటికై అడ్వాన్సు ఇచ్చాం. ఆ విధంగా 2007 డిశంబరు నెలలో ప్రారంభమైన మా అన్వేషణ, 2008 ఫిబ్రవరి నెలాఖరుకల్లా ముగిసింది.

అప్పటికి మా ఇంటికి పునాదులు మాత్రమే తవ్వబడ్డాయి. ఇల్లు పూర్తవడానికి మరో ఆరునెలల సమయం ఉంది. ఈ లోపుగా ఆ నిర్మాణ సంస్థ వారి డిజైన్ స్టూడియోకి వెళ్ళి ఇంటిలోకి కావలసిన గ్రానైట్, వుడ్ ఫ్లోరింగ్, కార్పెట్, కాబినెట్స్, టైల్స్ మున్నగున వాటిని మా అభిరుచులకు తగ్గట్లుగా ఎంపిక చేశాం. ఇల్లు పూర్తయ్యే ఆరు నెలలలోనూ, రెండు మూడు సార్లు, వివిధ నిర్మాణ దశలలో ఇంటి పురోగతిపై అవగాహన కల్పించడానికి  నిర్మాణ సంస్థ వారు దగ్గిరుండి మరీ ఇంటిని చూపించారు. ఇల్లు మరో నెల రోజులలో చేతికి వస్తుందనంగా, వివిధ ఫర్నిచర్ షాపులకు వెళ్ళి, ఇంటికి కావలసిన సోఫా, డైనింగ్ టేబుల్, కాఫీ టేబుల్, LCD టీవీ మొదలైన వాటిని కొన్నాం. మొత్తానికి ఆరునెలలలో ఇల్లు పూర్తయ్యి, 2008 ఆగష్టు నెలాఖరికల్లా కొత్త ఇంటిలో గృహప్రవేశం చేయగలిగాము.

ఇంతకీ ఈ ఇల్లు డ్యూప్లెక్స్ ఇల్లు. బేస్‌మెంటులో  రెండుకార్లు పెట్టుకొనే గ్యారేజు, ఒక హాబీ రూం, మొదటి అంతస్తులో లివింగ్ రూం, డైనింగ్ రూం, కిచెన్, ఫ్యామిలీ రూం, పౌడర్ రూం (అంటే 1/2 బాత్), రెండవ అంతస్తులో రెండు గెస్టు బెడ్ రూంస్, లాండ్రీ రూం, సెకండ్ బాత్ రూం, మాష్టర్ బెడ్ రూం, మాష్టర్ బాత్ రూం. ఇక ఇంటి ముందు పై కప్పుతో ఉండే ఒక చిన్న వరండా (పోర్చ్). ఇక మా ఇంటికీ, పక్క ఇంటికీ మధ్య ఒక చిన్న సైడ్ యార్డ్ (సందు లాంటిది). ఇదండీ మా ఇంటి ప్లాన్.

ఈ ఇంటికి ఎప్పుడైతే వచ్చామో, అప్పటినించీ మా వారాంతం మా చేతులలో ఉండడం లేదు. ఇంత పెద్ద ఇల్లును విడతలు విడతలుగా శుభ్రం చేసుకోవడంతోనే గడిచిపోతోంది. అందులోనూ సంతృప్తి ఉందనుకోండి. కానీ ఎప్పుడో వారాంతంలో ఒకసారి బ్లాగు రాసే నేను, ఈ మధ్య  పనులవల్ల అలసిపోయి, మంచం ఎక్కితే చాలు గుర్రుకొట్టి నిద్రపోతున్నాను. కొత్త ఇల్లేకాక, నా బ్లాగ్నిశబ్దానికి మరో కారణం కూడా ఉంది. అది తరువాతి బ్లాగులో తెలియపరుస్తాను. అంతవరకు మా ఇంటి ఫొటోలను చూడండి…

తెలుగు ఉచ్ఛారణ లో ధర్మ సందేహాలు..!!

ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. చదవడానికి సిల్లీగా అనిపిస్తాయని ఇన్నాళ్ళూ బ్లాగలేదు కానీ, ఇక ఆగలేను. తెలుగులో మూడు పదాల ఉచ్ఛారణలో నాకు ఎప్పుడూ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అంతకీ నా చుట్టుపక్కల కొంతమందిని అడిగినా ఎవరూ సంతృప్తికరంగా నివృత్తి చేయలేకపోయారు. మన బ్లాగుగుంపునుంచీ ఎవరైనా ఆ పని చేయగలరని ఆశతో..

1. బ్రహ్మ Vs బ్రమ్హ: నవ్వుకోకండి..!! మనలో చాలామంది తెలుగులో రాసేటప్పుడు “బ్రహ్మ” అని రాసినా, ఉచ్ఛరించేటప్పుడు “బ్రమ్హ” అని ఉచ్ఛరిస్తారు. చాలామంది దగ్గిర గమనించే ఇది రాస్తున్నాను. మరీ ముఖ్యంగా “ప్రరబ్రహ్మ”, “బ్రహ్మానందం”, “బ్రహ్మాండం”, “సుబ్రహ్మణ్యం” లాంటి పదాల ఉచ్ఛారణలో ఇది ఎక్కువగా గమనించాను. ఏదో టీవీలో న్యూస్‌రీడర్ల వద్ద అయితే ఎక్కువ పట్టించుకోకపోదును. కానీ, “బాల సుబ్రహ్మణ్యం”, “బాల మురళీకృష్ణ” లాంటి ప్రముఖ గాయకుల గాత్రాలలో కూడా ఇది గమనించాను. నా దృష్టిలో మాత్రం “బ్రహ్మ” అని ఉచ్ఛరించడమే సరిఅయినదని అభిప్రాయం. మీలో ఎవరైనా ఈ విషయాన్ని గమనించారా..? మీరు ఏమని ఉచ్ఛరిస్తారు..? మీ అభిప్రాయం ఏమిటి..?

2. కథ Vs కధ: నేను చిన్నప్పుడు తెలుగు రాయడం నేర్చుకొంటున్నప్పుడు, “కథ” కి పొట్టలో చుక్క పెట్టాలని నెత్తిపై మొట్టి మరీ చెప్పేవారు. కానీ ఉచ్ఛరించేటప్పుడు మాత్రం “కధ” అని పలికినా ఏమీ అనేవారు కారు. ఇప్పటికీ నేను “కధ” అనే చాలాసార్లు ఉపయోగిస్తాను. ఇంతకీ సరీయిన ఉచ్ఛారణ ఏమిటి..?

3. ఫలం (Phalam) Vs ఫలం (fhalam): వీటి మధ్య తేడాను వ్యక్తీకరించడానికి ఆంగ్లంలో రాయవలసి వచ్చింది. రాసేటప్పుడు ప, ఫ, బ, భ, మ లలో వత్తు “ఫ” ను ఉపయోగించినా, పలికేటప్పుడు ఆంగ్లంలోని “F” ను ఉపయోగిస్తూంటాము. నేను కూడా సాధారణంగా ఇదే చేస్తాను. కానీ ఇది సరి అయినదేనా..?

మీలో ఎవరికైనా పైన చెప్పిన మీమాంస తలెత్తిందా..? మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ..

“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది.

ఈ పుస్తకంలో రకరకాలైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అనుభవాలు రచయిత విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు, వాటిని ఆయన పరిష్కరించిన విధానం, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు, వీటికి సంబంధించినవి అయితే, మరికొన్ని అనుభవాలు ఆయన పదవీకాలంలో అగుపడ్డ విచిత్రమైన, హేతువుకు అందని సంఘటనలు. వీటితో పాటుగా, T.T.D పై ఆ నాటి రాజకీయ నాయకుల ప్రభావం, కార్యనిర్వహణ అధికారికికి గల విశేష అధికారాలు, వాటికి గల పరిమితులు మొదలైనవి కూడా చక్కగా వివరింపబడ్డాయి.

తిరుమలలో 1978-82 మధ్య జరిగిన అనేక రకాలైన అబివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు, వాటి వెనుక ఉన్న కృషీ, నిబద్ధతా, అమలు జరుపబడ్డ పటిస్టమైన ప్రణాళికలూ  ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది తిరుమలలలో అమలుజరపబడ్డ మాస్టర్ ప్లాన్ వివరాలు.  అక్రమ కట్టడాల కూల్చివేత, సన్నిధి వీధి విస్తరణ, అధునాతన క్యూ కాంప్లెక్స్, ఆస్థాన మండపం, గెస్ట్‌హవుస్‌లు, భోజన శాలలు, కల్యాణకట్టల నిర్మాణాల సమయంలో ఎదురైన అనుభవాలు, స్థానికుల వ్యతిరేకత, వాటిని అధిగమించిన విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.  తిరుమలలో ధ్వజస్థంభం పుచ్చిపోతే, ఆ స్థానంలో కొత్త ధ్వజస్థంభ ప్రతిష్టాపనకై ఆగమ శాస్త్ర ప్రకారం కొమ్మలు, తొర్రలు లేని ఎత్తైన చెట్లకై సాగిన అన్వేషణ,  చివరకు అవి కర్ణాటకలోని అడవుల్లో లభ్యం కావటం, వాటిని అతి కష్టం మీద తిరుమలకు చేర్చడం వంటి వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తిరుమలలో ఏడవ నంబరు మైలు రాయి వద్ద నడక దారిలో జరిగిన స్త్రీ హత్య వివరాలు, ఆ తరువాత నడకదారిలోని ప్రయాణికుల భద్రత పెంచడానికి T.T.D తీసుకొన్న చర్యలు, వాటితో పాటుగా ఆంజనేయ స్వామి ఎత్తైన విగ్రహాన్ని అదే మైలు రాయి వద్ద ప్రతిష్టించడం వంటి వివరాలు ఆలోచింపచేస్తాయి. ఇక పెద్ద కళ్యాణోత్సవం సమయంలో వృధా అయ్యే పూజా ద్రవ్య వివరాలు, ప్రసాదం తయారీలో ఉన్న ఇబ్బందులు, ఆలయంలోని వివిధ మిరాసీదార్ల లాభాపేక్ష, ప్రత్యేక కళ్యాణోత్సవం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఒకప్పుడు 12 గంటలకు పైగా పట్టే ధర్మ దర్శనం సమయాన్ని క్రమంగా గంట, రెండు గంటలకు కుదించగలిగిన వైనం, వాటికై అమలుపరిచిన ప్రణాళికలు అబ్బుర పరుస్తాయి.

తిరుమలకు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేయవలసిన V.I.P దర్శన ఏర్పాట్లు, కల్పించవలసిన భద్రత, సిబ్బందికి చూపించవలసిన వసతి సదుపాయాలు, ఆ క్రమంలో సాధారణ భక్తులు పడే ఇబ్బందులు, వాటికి పరిష్కారంగా నిర్మింపబడ్డ “పద్మావతీ గెస్ట్‌హవుస్”, ఆ నిర్మాణ సమయంలో T.T.D పై వచ్చిన ప్రజాధన దుర్వినియోగ ఆరోపణలు వంటి విషయాలు చక్కగా వివరింపబడ్డాయి.

ఇక రచయితకి ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలకు వస్తే, తిరుమలలో 1978లో వచ్చిన తీవ్రమైన కరవు, నీటి కొరత, ఆ సమయంలో మూడురోజుల పాటు జరిపిన వరుణ జపం, అది పూర్తయిన వెంటనే కురిసిన కుండపోత వాన వంటి వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. శ్రీనివాసుని భక్తులకు పూర్తి నేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించే ప్రయత్నంలో వెడల్పుగా వుండే నామాన్ని చిన్నది చేయడం, ఆ తరువాత జరిగిన పర్యవసానాలు గగుర్పాటును కలిగిస్తాయి. ప్రతీ ఏటా తమిళనాడులోని శ్రివిల్లి పుత్తూరులోని గోదాదేవి కళ్యాణానికి తిరుమలనుంచీ పట్టుచీరను పంపే సాంప్రదాయం పుట్టుకకు సంబందించి రచయితకు ఎదురైన అనుభవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతే కాక రచయిత T.T.D కార్యనిర్వహక శాఖను తీసుకోవడానికి మొదట ఆయిష్టత కనపరచడం, ఆ తదుపరి ఎదురైన అనుభవాలు, పదవీకాలం చివరలో ఎదురైన అనుభవాలు మొదలుగునవి శ్రీనివాసుని భక్తులను ఆకట్టుకొంటాయి.

వీటితో పాటుగా, హిందూ ధర్మ పరిరక్షణకై T.T.D చేసిన విశేష కృషి, రామకృష్ణ మఠ నిర్మాణంలో పాత్ర, అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడం, ఆ క్రమంలో ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం, దాససాహిత్య ప్రాజెక్టు మొదలైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అదే విధంగా చెన్నారెడ్డి, వెంగళరావు, అంజయ్య, ఎన్.టి.ఆర్ వంటి ముఖ్య మంత్రులతో పనిచేసిన అనుభవాలు, వారి ఆగ్రహ ఆవేశాలకు లోనయిన సందర్భాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వివరాలు, ఇంకా మరెన్నో ఉన్నాయి.

మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి. అందుకే వీలు కుదిరితే తప్పక చదవండి. ఒకవేళ మీరు ఇప్పటికే చదివి ఉంటే మీ అభిప్రాయాలను పంచుకోండి.

దీపావళి: ‘సిసింద్రీ’ జ్ఞాపకాలు

దీపావళి వచ్చేసింది.. చిన్ననాటి జ్ఞాపకాలను వెంట తెచ్చేసింది.. దీపావళి.. నాకు అన్నింటికన్నా ఇష్టమైన పండగ. జీవితంలో ఎన్నో మధురానుభూతులను అందించిన పండగ. చిన్నప్పుడు మా ఊరిలో ఈ పండగ వస్తోందంటే మేం చేసే హడావిడి అంతా ఇంతా కాదు..

దీపావళి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది బాణసంచా.. మా చిన్నప్పుడు ఇప్పటిలా బాణసంచా కొట్లలో రెడేమేడ్‌గా కొనేవారు కాదు. ప్రతీ ఇంట్లోనూ చిన్న పెద్దా తేడాలేకుండా ఎవరికివారే బాణాసంచా తయారుచేసుకొనేవారు. ఇక కుర్రకారు హడావిడి అయితే నెలరోజుల ముందే మొదలయిపోయేది. మేము చిన్నప్పుడు ఇష్టపడి తయారుచేసిన బాణసంచా.. “సిసింద్రీలు”..!!

ఒక అంగుళం పొడుగులో సన్నగా శంకువు ఆకారంలో నల్లటి మందు నింపి ఉన్న కాగితపు గొట్టమే సిసింద్రీ. దీని తోకభాగాన్ని కొద్దిగా చింపి, నిప్పు అంటించి వదిలితే.. 5-10 సెకన్లపాటూ అది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇది తయారు చేసే విధానం చాలా సులువు కావడం, పడ్డ కష్టానికి ఎన్నో రెట్లు మజా రావడం, మిగిలిన వాటితో పోలిస్తే ప్రమాదం కలిగే అవకాశం తక్కువ కావడం వల్ల చాలామంది కుర్రకారు వీటిని తయారుచేసేవారు.

ఈ సిసింద్రీ గొట్టం తయారీకి ముఖ్యంగా కావలసింది..కాగితం, కొన్ని అన్నం మెతుకులు, ఒక ఈనుప్పుల్ల. దినపత్రికల కాగితాలనుంచీ సోవియట్ కాగితాలవరకూ ఎవరి స్తోమతకు తగ్గ కాగితాన్ని వారు ఉపయోగించేవారు. దళసరి కాగితం అయితే మందు దట్టించడానికి వీలుగా ఉండడమే కాక, సిసింద్రీ చేతిలో చీదే అవకాశాలు తక్కువ. ముందుగా కాగితాన్ని సుమారు 2X2 అంగుళాల చతురస్రాకారంలో కత్తిరించొకొని, ఒక ఈనుప్పుల్లను ఆ కాగితం అంచులో ఉంచి, ఒకవైపు నొక్కి పట్టుకొని, మరోవైపు పుల్లతో పాటుగా కాగితాన్ని తిప్పుకొంటూ పోతే గొట్టం అకారం తయారవుతుంది. కాగితం అంచుల్ని జాగ్రత్తగా అన్నం మెతుకుల జిగురుతో అతికించి, సన్నటి కొనని కొద్దిగా మడిస్తే గొట్టం తయార్..!!

ఇలా తయారయిన గొట్టాలను తడి ఆరేవరకు ఎండబెట్టిన తరువాత మందుకూరడానికి వాడుకోవచ్చు. సిసింద్రీకి దళసరి కాగితం, సన్నని ఆకారం ఎంత ముఖ్యమో, నాణ్యత గల మందు అంతే ప్రధానం. అందుకే కొంచెం ఖరీదైనా మంచిరకం మందునే కొనేవాళ్ళం. ఈ మందును సూరేకారం, గంధకం కలిపి తయారు చేస్తారని జ్ఞాపకం. మంచిరకం మందును ఎండలో పెడితే మెరుపు కనిపించాలి, లేకుంటే బొగ్గుపొడి కలిసి కల్తీ జరిగినట్టు లెక్క. అలాగే కొనేముందు కొంత మందును మండించి సంతృప్తి చెందితే కానీ కొనేవాళ్ళం కాదు. ఈ మందును కొంతసేపు ఎండలో ఉంచి గొట్టాలను నింపడానికి వాడుకోవచ్చు. గొట్టంలో కొద్దికొద్దిగా మందు నింపుతూ, ఈనుప్పుల్లతో దట్టించాలి. ఇలా 4-5 దఫాలుగా గొట్టాన్ని 90% వరకూ నింపి, మిగిలిన ఖాళీని మందు కారిపోకుండా మూయడానికి ఉపయోగించాలి. ఇలా తయారైన సిసింద్రీని చూపుడువేలు, బొటనవేలు మధ్య నొక్కి చూస్తే గట్టి రాయిలా ఉండి, రెండువైపులా మందు కారిపోకుండా ఉంటే నాణ్యత బాగున్నట్టు లెక్క.

ఈ మాత్రం కష్టం కూడా పడకుండా సిసింద్రీని ఆస్వాదించాలనుకొనే వారికి వీలుగా కొంతమంది కుర్రకారు సిసింద్రీ వ్యాపారాన్ని చేసేవాళ్ళు. ఖాళి గొట్టాలనుంచీ, కూరిన సిసింద్రీలవరకూ 50-100 చొప్పున అమ్ముకొని లాభాలతో పాకెట్ మనీ సంపాదించుకొనేవారు. అప్పట్లో 100 సిసింద్రీలు ఖరీదు 3-4రూ|| ఉండేది.

ఇక ఈ సిసింద్రీలను అంటించడానికి కొంతమంది అగరొత్తులను ఉపయోగించినా, సరైన సాధనం మాత్రం “చాంతాడు”. లావుగా, బలంగా ఉండి నూతినుంచి చేదను పైకి లాగడానికి ఉపయోగించే ఈ చాంతాడు ముక్కను ఒకవైపు వెలిగిస్తే ఇక అది ఆరిపోయే సమస్యే లేదు. ఒక చేత్తో తాడును పట్టుకొని, మరో చేతిలో సిసింద్రీ తీసుకొని, నోటితో దాని కొసను కొరికి, కొద్దిగా మందు బయటకు వచ్చేలా చిదిమి, తాడుతో అంటిస్తూ, ఒకవేళ వెంటనే అంటుకోకుంటే నిప్పురాజుకొనేలా నెమ్మదిగా నోటితో ఊదుతూ, అంటుకొన్నాకా ఒక సెకను లాగేవరకూ వేచిచూసి నేర్పుగా వదిలితే… రకరకాల మెలికలు తిరుగుతూ అది చేసే విన్యాసాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు..!!

ఈ సిసింద్రీలను చొక్కా, లాగూల జేబుల్లో నింపుకొని సాయంత్రం 6-7 గంటలకు రోడ్డెక్కితే మరల 9-10 గంటలకి కడుపు మాడేవరకూ వళ్ళు తెలిసేది కాదు..!! ఈ సిసింద్రీ మందుతో నల్లగా మాసిన చొక్కాలు, లాగూలు ఉతకలేక ఆడవాళ్ళ తల ప్రాణం తోకకొచ్చేది. ఇక రోడ్ల మీద తిరిగే వారుకూడా దీపావళి వచ్చిందంటే ఎంతో జాగురూకతతో నడిచేవారు. “స్..స్..” మని శబ్దం వినిపించగానే ఎలర్ట్ అయిపోయేవారు. అయినప్పటికీ ఏ సైకిల్ మీద వెళ్ళేవాడి లుంగీలోనో దూరడం, వాళ్ళు తిట్లు లంకించుకోవడం, మేం ఏ సందులోకో దూరి పారిపోవడం జరిగిన సందర్భాలు అనేకం.

ఈ సిసింద్రీల విషయంలో చాలా పందేలు కూడా జరిగేవి. ఒకసారి బాగా మెత్తగా ఉన్న సిసింద్రీ వేయమని నా స్నేహితుడు పందెం కడితే పౌరుషానికి పోయి అంటించానో లేదో.. చేతిలో అడ్డంగా చీదేసింది..!! అంతే అందరూ ఒక్కసారి ఇళ్ళకు పరార్..!! ఎప్పుడూ హుషారుగా ఇంటికొచ్చే నేను పిల్లిలా నడుచుకుంటూ రావడం చూసి మా అమ్మకు అనుమానం వచ్చేసింది. నేను ఏదో సర్దిచెప్పి గాయం మీద రాయడానికి ఇంకు బాటిల్ గురించి వెతికి వెతికి కనిపించక చివరికి అమ్మనే అడగాల్సి వచ్చింది. విషయం కనిపెట్టిన అమ్మ నా వీపుమీద నాలుగు ఇచ్చుకోవడం, నాన్నగారు ఆయింట్‌మెంట్ రాయడం ఇప్పటికీ మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకం..!!

ఇక్కడే మరో విషయం కూడా గుర్తుకువస్తోంది. మా స్కూల్లో K.G.K గారని ఒక మాష్టారు ఉండేవారు. ఆయన తన ఇంట్లోనే సిసింద్రీ మందు, పటాసు తయారుచేసేవారు. ఆయన మందంటే చుట్టుపక్కల ఊర్లన్నింటిలోనూ పెద్ద పేరు. అటువంటి ఆయన ఇంట్లో ఒక సంవత్సరం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు ముగ్గురు చనిపోయినట్లు కూడా గుర్తు. లైసెన్సు లేకుండా బాణసంచా తయారు చేయడంవల్ల పోలీసులు ఆయన్ను అరెస్టి కొన్ని రోజులు జైల్లో పెట్టారు. జరిగిన ప్రమాదంలో ఆయన తప్పు ఎంతున్నా, మా కుర్రకారుకు మాత్రం ఆయన్ను జైల్లో పెట్టడం ఎంతో విషాదాన్ని కలిగించింది.

ఇక సిసింద్రీలే కాక, మతాబులు, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు, పేక టపాకాయలు, తారాజువ్వలు, తిప్పుడు పొట్లాలు లాంటివెన్నో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళం. ఇప్పుడు మా వూరిలోనే ఏ కొద్దిమందో తప్ప వీటిని తయారుచేయడం చూడట్లేదు..!!

“రెడీ” … తప్పక చూడండి..!!

ఈ సినిమాను నేను గత వారమే చూసాను. ఈ మధ్య హాస్యం ముసుగులో వచ్చే ద్వంద్వార్థ సంభాషణల సినిమాలనీ, సందేశం పేరుతో వచ్చే హింసాత్మక సినిమాలనీ, భక్తి పేరుతో వచ్చే అశ్లీల చిత్రాలనీ చూసి విరక్తి కలిగి కొన్నాళ్ళు తెలుగు సినిమాలనుంచీ విశ్రాంతి తీసుకొన్నాను. కానీ ఈ సినిమాకి వచ్చిన మంచి సమీక్షలు చదివి, అప్పటికీ అంతగా నమ్మకం లేకపోయినా, ఒక రాయి విసిరి చూద్దామన్న ఉద్దేశ్యంతో వెళ్ళిన నన్ను ఈ సినిమా నిరాశ పరచలేదు. పైగా చాలా కాలానికి ఒక చక్కటి కుటుంబ హాస్య కథా చిత్రాన్ని చూసిన అనుభూతి మిగిల్చింది.

ఇక కథ విషయానికి వస్తే సాదాసీదా కథే.. ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకోవడం.. ప్రియురాలు ప్రియుడి ఇంటికి అతిథిగా వచ్చి ప్రియుడి తల్లితండ్రులనీ, అతడి కుటుంబ సభ్యులనీ తన ప్రవర్తనతో ఆకట్టుకోవడం.. ఆ తరువాత ప్రియుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని నయానో, భయానో, యుక్తితోనో, పట్టుదలతోనో ఒప్పించడం వంటి కథాంశం మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ‘మైనే ప్యార్ కియా..’, ‘దిల్‌వాలే..’, ‘నిన్నే పెళ్ళాడతా..’ కాలం నుంచీ.. ఈ మధ్య వచ్చిన ‘నువ్వొస్తానంటే..’, ‘చందమామ’ వంటి సినిమాల వరకూ కొంచెం అటూ ఇటూగా ఇలాంటి కథలే.. అటువంటి మూస కథనుకూడా జనాన్ని మెప్పించగలిగేలా చిత్రీకరించడంలో స్క్రీన్‌ప్లే చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా హాస్య, వినోద ప్రథానంగా చిత్రీకరించడంతో చక్కని నవ్వులు పండించగలిగారు.

సినిమా ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. హీరో హీరోయిన్లు అడవిలోకి పారిపోవడం, అక్కడ ప్రేమలో పడడం వంటి సన్నివేశాలు ‘క్షణక్షణం’, ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక హీరోయిన్ అమెరికా వెళ్ళిపోవాలనుకోవడం, పాస్‌పోర్ట్ వచ్చేంతవరకూ హీరో తన ఇంటిలో ఆశ్రయం కల్పించడం వంటివి ‘ఒక్కడు’ సినిమాను పోలి ఉన్నాయి. ఈ విధంగా ప్రథమార్థం మరీ గొప్పగా లేకున్నా, బోర్ మాత్రం కొట్టించలేదు. అడవిలో వచ్చే ఒక ఫైట్‌ను బాగా చిత్రీకరించారు.

సినిమా ద్వితీయార్థం వచ్చేసరికి వేగం పుంజుకొంటుంది. అందుకు ముఖ్యకారణంగా బ్రహ్మానందం పోషించిన ‘మెక్‌డవల్ మూర్తి ‘ పాత్రను చెప్పుకోవాలి. ద్వితీయార్థం సగభాగం వరకూ అసలు నిజం తెలియక, జరుగుతున్న నాటకంలో తనో పావుగా వాడుకోబడుతున్నానన్న విషయం గ్రహించలేక, తనకేదో అతీంద్రీయ శక్తులున్నట్టుగా భ్రమలో బతికే సన్నివేశాలు ఒక ఎత్తయితే… అసలు విషయం గ్రహించి, మింగలేక, కక్కలేక, తను ఎంత బయటకు రావాలంటే అంతకు మరింత ఊబిలో కూరుకొని మథనపడే పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రను ‘డీ’ సినిమాలోని ‘చారి’ పాత్రకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైన తేడా అల్లా ‘డీ’ లో అతని పాత్ర లేకున్నా కథాగమనానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ ఈ సినిమాలో అతని పాత్ర లేకుండా కథే ముందుకు నడవదు. అంతటి ముఖ్య పాత్రను అవలీలగా పోషించి తనకు తనే సాటి అని మరోసారి నిరూపించుకొన్నాడు.

ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే హీరో రాం చక్కటి ఈజ్ తో నటించాడు. డ్యాన్స్‌లు, ఫైట్‌లతో పాటు చక్కటి హావభావాలను కూడా పలికించగలిగాడు. కానీ ఇతని నటనపై ‘పవన్ కళ్యాణ్’ ప్రభావం చాలా చోట్ల కనిపించింది. అది పోగొట్టుకొని సొంత శైలిని అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ‘జెనీలియా’కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అయిపోయినట్టున్నాయి. ఆమె మొదటి సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణతి సాధించినట్టే చెప్పుకోవాలి.

ఇక శాస్త్రీయ నృత్యం నేర్చుకొంటూ, ఆ క్రమంలో తన మగలక్షణాలు కోల్పోయి ఆడంగి వేషాలు వేసే పాత్రలో సునీల్, హీరో హీరోయిన్లకు లిఫ్ట్ ఇచ్చి ఆపై విలన్లకు దొరికిపోయి చివరి వరకూ వారి గొడ్లచావడిలో బందీగా పడిఉండే పాత్రలో ధర్మవరపు చక్కగా ఇమిడిపోయారు. ఫ్యాక్షనిస్టు సోదరులుగా అటు విలనీని, ఇటు హాస్యాన్ని సమపాళ్ళలో పోషించగలిగే కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి లను ఎంచుకోవడం పాత్రల ఎంపికపై దర్శకుడు పెట్టిన శ్రద్ధను చూపుతుంది. వీరి కొడుకులుగా నటించిన ‘షపీ’, ‘రవితేజ తమ్ముడు’ పాత్రలు కొంత విలనీని సృష్టించేదుకు తప్ప అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు. ‘చికాగో సుబ్బారావు’ గా నాజర్, ‘డల్లాస్ నాగేశ్వరరావు’ గా తనికెళ్ళ భరణి బాగానే నటించారు.

ఈ సినిమాలో మరో హాస్య ప్రధాన పాత్ర.. జయప్రకాష్ రెడ్డి మనవడై తాతగారి అడుగుజాడల్లో నడిచి పెద్ద ఫ్యాక్షనిష్టు అయిపోవాలని బిల్డప్పులిచ్చే పిల్లవాడి పాత్ర. ఈ పిల్లవాడిని ‘పంచత్రంత్రం’ సినిమాలో మొట్టమొదటిగా ‘హార్టులో హోళు ‘ ( hole in the heart ) ఉన్న మళయాళం అబ్బాయి పాత్రలో చూసినప్పుడే ఎంతో ఆకట్టుకొన్నాడు. చక్కటి టైమింగ్, హావభావాలు పలికించగలిగే ఈ పిల్లవాడు భవిష్యత్తులో మరింత పెద్ద కమెడియన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

ఈ విధంగా సినిమాలో ప్రతీ పాత్ర దానికై ఒక ప్రాధాన్యతను కలిగి ఉండి, అదే సమయంలో కథలో ఇమిడిపోయి, తనవంతుగా కథనాన్ని రక్తికట్టించడంలో తోడ్పడడంతో ద్వితీయార్థం మొత్తం నవ్వుల జల్లు కురిసి చక్కటి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు.

ఇక సంభాషణల విషయానికి వస్తే చాలా చోట్ల హాస్యాన్ని పండించడంలో తోడ్పడ్డాయి. చివరిలో ‘వాళ్ళు మనల్ని మోసం చేయలేదు.. మనుషుల్ని చేసారు..’ వంటి సెంటిమెంట్ సంభాషణలు కూడా సన్నివేశానికి అనుగుణంగా బాగున్నాయి. సంగీతం విడిగా అంత గొప్పగా లేకున్నా, సినిమాలో సందర్భానుసారంగా చూస్తే బాగున్నట్టే చెప్పాలి.

మొత్తం మీద ఒక రెండున్నరగంటల సేపు అన్నీ మరచిపోయి సరదాగా కుటుంబంతో నవ్వుకొని రావాలంటే మిస్ అవ్వకుండా తప్ప చూడాల్సిన సినిమా ‘రెడీ’. మరెందుకు ఆలస్యం.. పోయి చూసి రండి..!!

కొసమెరుపు: ఇంతటి చక్కటి టాలెంట్ ఉన్న దర్శకుడు ‘శ్రీను వైట్ల ‘, చిరంజీవి లాంటి స్టార్‌హీరోతో ‘అందరివాడు ‘ లాంటి పరమ చెత్త సినిమాను ఎలా తీసాడో తలచుకొంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది..!!

కొత్తపాళీ గారు ఇచ్చిన “షేర్ ఆటో” ఇతివృత్త ఆధారంగా నేను అల్లిన కథ

“అంతర్మథనం” అన్న పేరుతో “ఈమాట” ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక మే సంచికలో ప్రచురితమయింది. ఇది నేను రాసిన మొట్టమొదటి కథ. చదివి మీ అభిప్రాయాలను తెలియచేయండి.

http://eemaata.com/em/issues/200805/1240.html

నాలాంటి ఎందరినో ప్రోత్సహిస్తూ, కథలను రాయడానికి ప్రేరేపిస్తూ, ఎంత బిజీగా ఉన్నా కొంత తీరిక సమయాన్ని ఈ కార్యక్రమానికై కేటాయిస్తున్న కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.

చిన్ననాటి ఆటలు – చింతగింజలు

చిన్ననాటి ఆటలను గురించి ఆలోచించుకొంటున్నప్పుడు తప్పక గుర్తుకు వచ్చే ఆట – చింతగింజలు. ఈ ఆటను ఎక్కువగా ఆడవారు ఆడుతూ ఉండేవారు. అందువల్ల ఈ ఆటలో పెద్దగా ప్రవేశం లేకపోయినా, మా అక్క, ఆమె స్నేహితురాళ్ళు ఆడుతున్నప్పుడో, లేక మా అమ్మ, పిన్ని ఆడుతున్నప్పుడో చూడడం వల్ల ఈ ఆటను గురించిన కొన్ని విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

ఈ చింతగింజలతో దాదాపు మూడు-నాలుగు రకాలైన ఆటను ఆడుతూ ఉండేవారు. ఏ ఆటలో అయినా ఎవరికి ఎన్ని ఎక్కువ చింతగింజలు వస్తే వారు గెలిచినట్లు లెక్క. ఈ చింతగింజలను లెక్కించడానికీ ఒక కొలమానం ఉంది..!!   అదేమిటంటే: నాలుగు గింజలను ఒక “పుంజి” అంటారు. రెండు పుంజిలు కలిస్తే ఒక “కచ్చట”. అయిదు కచ్చట్లు ఒక “గుర్రం”. అయిదు గుర్రాలు ఒక “ఏనుగు”..!! ఈ విధంగా లెక్కించి ఆట చివర్లో ఎవరికి ఎక్కువ గింజలు వస్తే వారిని విజేతగా నిర్ణయిస్తారు.

ఇక చింతగింజలతో ఆడే ఆటల వివరాలలోకి వెళ్దాము. మొదటి రకం ఆటలో చింతగింజలన్నీ కొంచం చెదురుమదురుగా నేలపై పరుస్తారు. మొదటగా ఆట ఆడే వ్యక్తి ఒక చింతగింజను తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ గింజ తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న చింతగింజలలో కొన్నింటిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర గింజలూ కదలకూడదు. అదే సమయంలో పైనున్న గింజ నేలకు తాకకుండా అదే గుప్పిటతో మరల అందుకోవాలి. పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, లేక కిందనున్న ఏ ఇతరగింజలు కదిలినా ఆ వ్యక్తికి ఆటను కొనసాగించే అవకాశం పోతుంది. ఈ లోపుగా సేకరించగలిగిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. ఈ విధంగా ఆట ఒకరినుంచి ఇంకొకరికి మారుతూ కిందనున్న గింజలన్నీ అయిపోయేదాకా కొనసాగుతుంది. చూడడానికి ఎంతో సులువుగా అనిపించినా, ఎంతో ఏకాగ్రత, కళ్ళు – చేతులు మధ్య ఎంతో సమన్వయం ఉంటేగాని సాధ్యపడని ఆట ఇది.

ఇక రెండో రకం ఆటను మేము “ఊదే ఆట” అని పిలుచుకొనే వాళ్ళం. ఈ ఆట ఆడడం చాలా సులువు. మొదటగా చింతగింజలన్నీ నేలపై ఒక కుప్పగా పోస్తారు. ప్రతీ వ్యక్తీ, తన అవకాశం వచ్చినప్పుడు, బాగా.. నోటితో గాలి పీల్చి, నేలపై ఉన్న గింజలన్నిటినీ గట్టిగా ఊదాలి. ఆ ఊదిన వేగాన్ని బట్టీ గింజలు కొంత చెల్లాచెదురవుతాయి. అప్పుడు ఒక్కొక్క గింజనే, పక్కనున్న గింజలు కదలకుండా పక్కకు తీస్తూ పోవాలి. ఈ విధంగా సేకరించిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఆట చాలా ఇష్టంగా ఉండేది.

ఇక మూడోరకం ఆటలో కూడా నేలపై చింతగింజలను చెదురుమదురుగా పరుస్తారు. ఆట ఆడే వ్యక్తి తన ఎడంచేతి బొటన, చూపుడు వేళ్ళను నేలపై నిటారుగా ఆనించి  , వాటి మధ్య తిరగేసిన “U” అకారంలో చోటు వచ్చేలా నిలిపి ఉంచాలి. ఇక కుడిచేత్తో ఒక చింతగింజను గాలిలోకి ఎగురవేస్తూ, అది కిందకుపడేలోపుగా, కిందనున్న చింతగింజలను ఒక్కొకటినీ, పక్కన గింజలకు తగులకుండా ఇంతకు ముందు చెప్పిన “U” ఆకారంగల చోటులోకి తోస్తూపోవాలి. అంటే ఫుట్‌బాల్ ఆటగాడు గోల్ చేసినట్లన్నమాట..!! పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, కిందనున్న గింజలు కదిలినా అవకాశం పక్కన వ్యక్తికి వెళ్ళిపోతుంది.

పైన చెప్పిన మూడు రకాల ఆటలనే కాక, చింతగింజలతో “వామన గుంటలు” అనే ఆటను కూడా ఆడేవాళ్ళం. దీనినే ఇప్పుడు “మంకాలా” అనే పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ ఆటకూడా మెదనుకు పదును పెట్టే విధంగా ఉంటుంది. ఇంట్లో చింతకాయతో ఊరగాయలు లాంటివి పెట్టేటప్పుడు పోగయ్యిన చింతగింజలన్నీ తీసి అవతల పారవేయకుండా, వాటిని భద్రపరచి, మెదడుకు పదును పెట్టే ఆటలకు ఉపయోగించడం మనవారికే చెల్లింది. మరే ఇతర ప్రాచీన ఆటలవల్లే ఈ చింతగింజల ఆటలుకూడా క్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

మా ఊరిలో.. వీధి సినిమా..!!

సాధారణంగా పల్లెటూర్లలో పండుగ వచ్చిందంటే ఎంత హడావిడి వాతావరణం నెలకొని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరాల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఆ పండుగ పదిరోజులూ పొద్దున్న ఆరింటికి మొదలు పెట్టి సాయంత్రం వరకూ ఆగకుండా సాగే లౌడు స్పీకర్ల హోరు ఒక ఎత్తైతే, ప్రతీ సాయంత్రం వీధిలో రోడ్డుకు అడ్డంగా తెర కట్టి ప్రదర్శించే సినిమాలు మరొక ఎత్తు.

ఈ పండుగల హడావిడి సాధారణంగా ఒక నెల ముందే మొదలవుతుంది. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించే కార్య నిర్వాహక వర్గం అన్నింటికంటా ముందుగా చేసే పని.. చందాలు వసూలు చేయడం. ఉత్సవాలు నిర్వహించే ప్రదేశానికి చుట్టుపక్కన ఉండే మూడు నాలుగు వీధులలోని ప్రతీ ఇంటికీ వీరు వెళ్ళి చందాలు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏ ఇంటిలో ఎంత చందా వసూలు చేయాలో, అలా వసూలు చేయాలంటే ఎవరు ఆ ఇంటికి వెళ్ళాలో, వాళ్ళని బుట్టలో ఎలా వెయ్యలో అంతా ప్రణాళిక వీరి దగ్గిర సిద్ధంగా ఉంటుంది. ఇలా వసూలైన చందాలను వీధుల్లో సీరియల్ బల్బులు, ట్యూబులైట్లు వేయడానికీ, మైకు సెట్లను పెట్టడానికీ, ఇంకా ఇతర ప్రచార కార్యక్రమాలకూ వాడుతూంటారు. కానీ ప్రతీ రోజూ రాత్రి ప్రదర్శించబోయే సినిమాల చందా విషయం మాత్రం కొంచం వేరుగా ఉంటుంది.

ఈ సినిమాలకు సాధారణంగా ఆ నాలుగు వీధులలో పరపతి గల.. లేదా పరపతికి పాకులాడే కుటుంబాలు స్పాన్సర్ చేస్తుంటాయి. ప్రతీ సంవత్సరం మనస్ఫూర్తిగా సినిమాకు చందా ఇచ్చే కుటుంబాలు కొన్నైతే, అస్సలు ఇష్టమే లేకపోయినా, వేరే వారిముందు తీసికట్టుగా ఉండకూడదని మొహం మాడ్చుకొని చందా ఇచ్చేవారు మరికొందరు. ఈ విధంగా పండుగ పది రోజులూ రోజుకొక కుటుంబం చొప్పున చందా ఇస్తూ ఉంటుంది.

ఈ సినిమాల ప్రదర్శనలు ప్రారంభమయ్యే రోజు రోడ్డుకు ఇరుపక్కలా గునపాలతో గోతులు తవ్వి రెండు కర్రలను నిలపెడతారు. వీటి మధ్యలో ఒక తెల్లటి తెరను వ్రేలాడదీసి దాని నాలుగు కొనలనూ కర్రలకు గట్టిగా బిగించి కడతారు. ఆ పదిరోజులూ ఏ పెద్ద వాహనాలు అటుగా రాకుండా కర్రలతో కొద్ది దూరంలో రోడ్డుకు అడ్డుకట్టి పక్క వీధిగుండా దారి మళ్ళిస్తారు.

ఇక సినిమా ప్రారంభమయ్యే రోజు పొద్దున్నే హంగామా మొదలవుతుంది. ఆ కూడలి నుంచీ మైకు సెట్టూ, లౌడు స్పీకర్తో కూడిన ఒక రిక్షా బయలు దేరుతుంది. దీనిలో ఒక మనిషి కూర్చొని నాలుగు వీధులూ తిరుగుతూ.. ఆ రోజు ప్రదర్శింపబడే సినిమా పేరు, నటీ నటుల వివరాలు, ప్రదర్శింపబడే సమయం, ప్రదేశం.. దానికి చందా ఇచ్చిన వారి వివరాలతో ప్రచారం చేస్తాడు.

సినిమా ప్రారంభం సాధారణంగా రాత్రి తొమ్మిది, పది గంటల మధ్య మొదలవుతుంది. ఈ ఉత్సవాల సమయంలో ఆ ప్రదేశమంతా వెలుగు జిలుగులతో ఉండడం వల్ల పిల్లలందరూ పెందలాడే అన్నం తిని ఆటలు మొదలు పెడతారు. పెద్దలందరూ నెమ్మదిగా భోజనాలు ముగించుకొని ఆ ప్రదేశానికి చేరుకొంటారు.. ఈ సినిమాకు జనాలు చాలా పకడ్బందీగా సిద్ధమవుతారు. రోడ్డు మీదనే కూర్చొని సినిమా చూడడానికి వీలుగా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు చాపలు, బొంతలు, కొంతమంది మడత కుర్చీలతో వస్తారు. ఇక రోడ్డు పక్కనే ఉండే మురికి కాలువల వల్ల ముసిరే దోమలనుండీ తప్పించుకోవడానికి ఓడోమాస్ రాసుకొని కొందరు బయలుదేరితే, అరుగులపై కూర్చొని సినిమా చూసేవారు మస్కిటో కాయిల్స్ వెలిగించుకొంటారు. ఇక రాత్రి మంచు పడే అవకాశముంటే మప్లర్లు, మంకీ కాప్‌లూ, చెవిలో దూదీ..వగైరా.. వగైరా..

ఇక సినిమాను ప్రదర్శించే ప్రొజెక్టర్ తెరకు దాదాపు పదిహేను అడుగుల దూరంలో ఉంటుంది. దానిపక్కనే ప్రొజెక్టర్ నడిపే మనిషి కూర్చునేందుకు ఒక కుర్చీ, ఆ ప్రొజెక్టర్‌కు కావలసిన కరెంటుకు దగ్గిరలో ఉన్న ఇంటినుంచీ లాగిన కరెంటు వైరూ, ఒక జంక్షను బాక్సూ ఉంటాయి. అప్పటిదాకా రణగొణ ధ్వనులతో నిండిన వాతావరణం, సినిమా ప్రారంభమవుతోందంటే నిశ్శబ్దంగా మారిపోతుంది. ప్రొజెక్టర్‌లోంచి వచ్చే కాంతి తెరమీద పడి.. చిత్రంగా..చిత్రంగా మారుతోంటే మా చిన్నతనంలో ఎంతో ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఇక ఆ తెరపై పేర్లు పడుతుండగా చూడడం ఒక మరపు రాని అనుభూతి. తెర ముందువైపు పడే పేర్లు సరిగా ఉంటే.. వెనుక వైపునుంచీ చూస్తే తిరగేసిపడి ఏదో వేరే భాషను చూస్తున్నట్లుగా వింతగా ఉండేది.

ఇక సినిమా ప్రారంభమైన దాదాపు ప్రతీ అరగంటకూ రీళ్ళు మార్చడానికి ప్రొజెక్టర్‌ను నిలుపు చేయడం వల్ల పది నిముషాలు విరామం ఉంటుంది. ఈ సమయంలో మరలా ఆ సినిమాకు చందా ఇచ్చినవారి పేర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో పనిలో పనిగా వ్యాపారాన్ని చేసుకొనే వేరుశనగ బండి, పిడతకింది పప్పుల వ్యాపారులగురించి చెప్పనే అక్కర్లేదు. ఈ విధంగా విరామాలతో కలిపి సినిమా పూర్తయ్యేసరికీ దాదాపు రాత్రి ఒంటిగంట దాటుతుంది. అప్పటిదాకా ఆగిపోయిన వీధి లైట్లూ, సీరియల్ బల్బులూ మరల యధావిధిగా వెలగడం మొదలుపెడతాయి.

ఇప్పుడు ప్రతీ ఇంట్లో టెలివిజన్ సెట్లూ, కేబుల్ కనెక్షన్లూ రావడంచేత వీధి సినిమాలు తగ్గిపోతున్నా, మా చిన్నతనంలో వీటికి విపరీతమైన ప్రజాదరణ ఉండేది.

నా క్రికెట్ వ్యసనం..!!

అవి నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు..!! అప్పటివరకూ ఏడు పెంకులాట, వీపుచట్నీలు లాంటి సాంప్రదాయక ఆటలతో కాలక్షేపం చేస్తున్న మా కుర్రకారు జీవితాలలలో జంటిల్మన్ క్రీడ ప్రవేశించిన రోజులు. నాలాంటి చాలామంది జీవితాలనే మార్చివేసిన క్రికెట్ క్రీడను మాకు పరిచయం చేసిన వ్యక్తి “మధుబాబ”..!!

మధుబాబ మా తాతగారి తమ్ముడి కొడుకు. అవడానికి బాబాయ్ అయినా, నాకన్నా చదువులో మూడేళ్ళు మాత్రమే సీనియర్. అప్పట్లో వాళ్ళ అమ్మగారు పోవడంతో మొత్తం కుటుంబం పెనుగొండ వచ్చి స్థిరపడ్డారు. మా మధుబాబ రాకతో అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న మా పెనుగొండ మొత్తం పూనకంతో ఒక్కసారి ఊగిపోయింది. తన అల్లరి, పోకిరి వేషాలతో మొత్తం పెనుగొండలో ఉండే పిల్లకాయల దగ్గిరనుంచీ, టీనేజ్ కుర్రాళ్ళ వరకూ అందరినీ ఎంతో కొంత ప్రభావితం చేసాడు మధుబాబ.  అప్పట్లో C.P (ChakraPAni, మా మధుబాబ అసలు పేరు) పేరు చెప్తే పెనుగొండలో చాలామంది తల్లిదండ్రులు ఉలిక్కిపడేవారు. అటువంటి మధుబాబ పరిచయం చేసిన క్రీడే క్రికెట్..!!

మా మధుబాబ చుట్టుపక్కల కుర్రాళ్ళందరినీ పోగుచేసి క్రికెట్ ఆడేవాడు. క్రమంగా ఈ పిచ్చి దావానలంలా వ్యాపించి, లాగు వేసుకోవడం రానివాడు కూడా క్రికెట్ బ్యాట్ పుచ్చుకొని వాడి లెవల్‌కి తగ్గ స్నేహితులతో క్రికెట్ ఆడేయడం సాధారణం అయిపోయింది. ఆ బంతి చుట్టుపక్కల ఇళ్ళలో పడి, వాళ్ళు పెట్టే శాపనార్థాలతో, తిట్లతో, పెనుగొండ వీథులు ప్రతిధ్వనించేవి. ఆ కొత్తగా తయారైన పిచ్చివాళ్ళలో నేనూ ఒకడిని..!! నా ఈ కొత్త సరదాను చూసి, ముచ్చటపడి, మా నాన్నగారు ఒక క్రికెట్ కిట్ కూడా కొని ఇచ్చారు. మంచి బ్యాట్, కొన్ని లెదర్ బాల్స్, వికెట్స్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ గ్లవ్స్ లతో సహా అన్నీ ఉండేవి. మా మధుబాబ కన్ను వెంటనే ఆ కిట్ మీద పడింది. అప్పటినుంచీ పెద్దపిల్లలు ఆడే క్రికెట్ జట్టులో నేనుకూడా సభ్యుడిని అయిపోయాను..!! చివర్లో ఏదో రెండు బంతులు ఆడడానికి ఇచ్చి, నాతో తూతూ మంత్రంగా రెండు బంతులు బౌలింగ్ చేయించి, మొత్తం కిట్‌ను అప్పనంగా వాడేసుకొనేవారు మధుబాబ మరియు అతని స్నేహితులు.. ఈ రాజకీయం అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అప్పటినుంచీ క్రికెట్కు బయలుదేరినప్పుడల్లా, మొత్తం ప్యాడ్లు, బ్యాటింగ్ గ్లవ్స్, చివరికి గార్డ్‌తో సహా అన్నీ నా వంటిమీద తగిలించుకొని అప్పుడే ఆటకు బయలుదేరేవాడిని. జట్టు కూర్పు ఎలా ఉన్నా ఓపెనర్‌ను మాత్రం ఎప్పుడూ నేనే..!! అదికూడా వెంటనే రెండు బంతులకే అవుటయిపోతే మొత్తం కిట్ తీసుకొని ఇంటికి చెక్కేసేవాడిని. లేదా మా అమ్మతో రికమెండేషన్ తీసుకొచ్చి ఇంకో ఓవరో, రెండు ఓవర్లో ఎక్కువ ఆడేవాడిని. ఇదంతా చూసి కుతకుతలాడిపోతున్నా, ఎలాగో ఓర్చుకొని, క్రికెట్ కిట్‌ను వదులుకోలేక నన్ను చచ్చినట్టు ఆడించుకొనేవారు.

ఇక ఈ క్రికెట్ పిచ్చి ఎంతగా ముదిరిందంటే, అప్పటి క్రికెటర్ల బౌలింగ్, బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ ఉండేవాడిని. దూరంనించీ కోతి కొబ్బరికాయ పట్టుకొచ్చినట్లు వచ్చే వెస్టిండీస్ బౌలర్ ప్యాట్రిక్ ప్యాటర్సన్, వేగంగా పరుగు మొదలు పెట్టి, చివరికి నీరసించి బౌలింగ్ చేసే అమర్‌నాథ్, రెండు చేతులనూ గిరగిరా తిప్పి స్పిన్ బౌలింగ్ చేసే అబ్దుల్ ఖాదిర్, కాళ్ళు వెడల్పుగా పెట్టి నిల్చుని బ్యాట్ చేసే శ్రీకాంత్, కాళ్ళు దగ్గిరగా పెట్టి మునివేళ్ళపై బ్యాట్ను ఆనించి నుంచుని బ్యాట్ చేసే గవాస్కర్.. ఇలా అందరినీ అనుకరించేసే వాడిని. మొదట్లో సరదాగా చూసినా, ఇక నా క్రికెట్ పిచ్చి ముదిరి పాకాన పడినట్లు గుర్తించి, ఇలా అయితే నా ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలు కొండెక్కుతాయని గ్రహించి, తిట్లు, దెబ్బలు లాంటివేమీ పనిచేయక.. చివరాఖరిగా.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది మా అమ్మ  ..!! ఏడవతరగతి పరీక్షలు అయ్యేంతవరకూ క్రికెట్ ఆడితే తనమీద ఒట్టేనంది.. ఒక్కసారి బ్యాట్ పట్టుకొన్నా తనని చంపుకొని తిన్నట్టే అంది.. ఆపై ఇక జీవితంలో నాతో మాట్లాడనంది.. గుడ్లనీరు కుక్కుకొంది.. కొంగు నోట్లో దోపుకొంది.. ఎక్కడో సినిమాల్లో తప్ప ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ సన్నివేశాలు నిజజీవితంలో ఎరుగని నేను, బుట్టలో పడిపోయాను. ఏదో హిప్నాటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మాట ఇచ్చేసాను..!! అంతటితో ఊరుకోక, నా పరివర్తనను నిరూపించుకోవాలనే వేడిలో మొత్తం క్రికెట్ కిట్ తీసుకెళ్ళి మండుతున్న బాయిలర్‌లో పడేసాను..!! కొంచం వేడి చల్లారాకా గానీ నేను చేసిందేమిటో అర్థంకాలేదు..కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఏడవతరగతి పరీక్షలయ్యేంత వరకూ ఒట్టుపేరు చెప్పి బెదిరిస్తూ నన్ను గుప్పెట్లో ఉంచుకోగలిగింది మా అమ్మ. మొత్తానికి ఆమె ఆశించినట్టు స్కూల్ ఫస్ట్ కాకున్నా, మూడవ స్థానం సంపాదించుకోగలిగాను..

అప్పటికి మా మధుబాబ ఇంకా పెనుగొండలో ఉంటే పాడైపోతాడని గ్రహించిన మా తాతగారి మరో తమ్ముడు, మధుబాబను ఆయనతో బెంగుళూర్‌కు తీసుకుపోయారు. దాంతో పెనుగొండ అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకొంది. కానీ అప్పటికే అతడు నాటిన బీజాలు మాలో లోతుగా నాటుకుపోయాయి. దానికి తోడు నేను అమ్మకి ఇచ్చిన ఒట్టు గడువు ముగియడంతో మరల క్రికెట్ మొదలుపెట్టాను. “కాదేది క్రికెట్‌కి అనర్హం..!!” అన్న రీతిలో రకరకాలుగా క్రికెట్ ఆడేవాళ్ళం. పరీక్షలు రాసే అట్టతో, షటిల్ కాక్ తో క్రికెట్.. తూటు కర్రలను బ్యాట్, బంతిగా చేసుకొని క్రికెట్.. కాగితాలను ఉండలుగా చుట్టి, పైన పురుకోస కట్టి, దానిని బంతిగా ఉపయోగించి క్రికెట్.. షటిల్ బ్యాట్, కాక్‌తో క్రికెట్.. పుస్తకాల పేజీ నంబర్లతో తరగతి గదులలో క్రికెట్.. ఇలా రకరకాలుగా ఆడేవాళ్ళం. పిల్లి పిల్లలను ఇళ్ళు మార్చినట్టు, ఒకేచోట ఎక్కువరోజులు ఆడి జనాల నోళ్ళళ్ళో నానడమెందుకని, కొన్నాళ్ళు మా మేడ మీద.. కొన్నాళ్ళు కృష్ణ వాళ్ళింటి పెరడులో.. కొన్నాళ్ళు రామాలయం వెనుకాలా.. మరికొన్నాళ్ళు మార్కెట్‌యార్డులో.. ఇలా రకరకాల చోట్లలో ఆడేవాళ్ళం. ఎనిమిది, తొమ్మిదో తరగతులలో పబ్లిక్ పరీక్షలు లేకపోవడంవల్ల మా అమ్మకూడా చూసీ చూడనట్టు వదిలేసేది.

కానీ పదవ తరగతికి వచ్చేసరికీ మరల నన్ను అదుపులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించింది మా అమ్మ. కానీ ఈసారి సెంటిమెంట్‌కు లొంగనని ముందే అర్థం చేసుకొని, తెలివిగా.. మా స్కూల్‌లో కెల్లా అత్యంత చండశాశనుడిగా పెరుపొందిన జయంతి వెంకట శాస్త్రులు గారు అనే లెక్కలు మాష్టారు దగ్గిర ప్రయివేట్‌కు కుదిర్చింది. ఆ ప్రయివేటు సరిగ్గా సాయంత్రం స్కూలు వదలగానే 5 గంటలకు మొదలయ్యేది. దానితో నా క్రికెట్ ఆటకు అడ్డు పడిపోయింది. ఎప్పుడో సెలవలు, ఆదివారాలలో తప్ప క్రికెట్ ఆడడానికి సమయం చిక్కేది కాదు. ఆ విధంగా మొత్తానికి నన్ను దారిలో పెట్టి పదవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చేలా చేయగలిగింది మా అమ్మ..!!

తరువాత క్రికెట్ ఆడడం తగ్గిపోయింది. EAMCET ర్యాంకు సంపాదించి, చదువు విలువ తెలుసుకొన్నాకా ఇంజనీరింగ్‌లో ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ క్రికెట్ మ్యాచ్‌లు వస్తే మాత్రం మొత్తం హాస్టల్ అంతా మెస్‌లోని టీవీకే అతుక్కుపోయేవాళ్ళం. ఆఖరుకు IISc బెంగుళూరులో M.S చేసినప్పుడుకూడా, ఎంతటి కఠినమైన చదువు కొనసాగించినా, కనీసం క్రికెట్ స్కోరు చూడడానికైనా ఖాళీ చేసుకొనేవాడిని.  
 
భూకంపం తరువాత అప్పుడప్పుడూ ప్రకంపనలు వచ్చినట్టు, ఇప్పటికీ నాలో క్రికెట్ పిచ్చి రగులుకొంటూనే ఉంటుంది. నా ఈ క్రికెట్ మ్యాచ్ పిచ్చి చూసి, 2003 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఇండియా చేరుకొందన్న విషయం తెలిసి, పాపం నాతో కూర్చుని ఓపికగా మ్యాచ్‌ను వీక్షించింది నా భార్య. అందులో ఏమిజరిగిందో ఎవరికీ గుర్తు చేయనవసరం లేదనుకొంటాను.. మరలా తిన్నగా ఉండక.. 2007 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రసారాన్ని Dish Network ద్వారా 200 డాలర్లకి కొన్నాను. మొదటి రౌండ్ లోనే ఇండియా చేతులెత్తేసాకా, ఇక క్రికెట్ చూడను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన నేను.., మరల కుక్కతోక వంకర కనుక.. 20-20 వరల్డ్ కప్‌నుంచీ షరా మామూలే..!! 

అమెరికా వచ్చిన కొత్తలో ఇక్కడి స్నేహితులందరినీ టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడదామని బలవంతం చేసేవాడిని. దానితో అందరూ నన్ను తప్పించుకు తిరిగేవారు. ఇలా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా యాదృచ్ఛికంగా ఇక్కడ కొంతమంది నాలాంటి పిచ్చివాళ్ళు తగిలారు. వాళ్ళు ప్రతీ శనివారం ఉదయం 7 గంటలనుంచీ 10 గంటలవరకూ ఒక పార్క్‌లో క్రికెట్ ఆడతారు. వాళ్ళు పరిచయం అయినప్పటినుంచీ శనివారం క్రికెట్ నా జీవితంలో భాగం అయిపోయింది. మామూలుగా ఉదయం 8:30 కి గానీ ముసుగు తీయని నేను, శనివారం మాత్రం 6:30 కల్లా తయారు అయిపోతాను. వారంలో ఎప్పుడూ ఒళ్ళు వంచని నేను, శనివారం మాత్రం చెమటోడ్చి ఆడతాను. ఇక బుధవారం నుంచీ ఇంటర్నెట్‌లో వారాంతానికి వాతావరణం ఎలావుంటుందోనన్న బెంగతో శాటిలైట్ నివేదికలు చూస్తూ ఉంటాను. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది..!!

చిన్ననాటి ఆటలు: వైకుంఠపాళి, అష్టా-చెమ్మా..!!

నేను చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తుతెచ్చుకొంటున్నప్పుడు, పరుగులు పెట్టి కిందపడి మోచేతులకీ, మోకాళ్ళకీ దెబ్బలు తగిలించుకొన్న ఆటలే కాక, బుద్ధిగా ఇంటిలో నీడ పట్టున కూర్చుని ఆడిన ఆటలు కూడా కొన్ని గుర్తుకువచ్చాయి. ముఖ్యంగా వేసవి సెలవల్లో, మండే రోహిణీకార్తె ఎండల్లో, మద్యాహ్న సమయాల్లో ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. వాటిల్లో ముందుగా గుర్తుకు వచ్చేవి వైకుంఠపాళి, అష్టా-చెమ్మా.

ఈ ఆటలు ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: నప్పులు, గవ్వలు. “నప్పు” ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. అప్పట్లో మేము చీపురు పుల్లలనీ, బలపాలనీ, రాళ్ళనీ, చింతగింజలనీ నప్పులుగా ఉపయోగించేవాళ్ళం. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. ఇప్పటి పిల్లలు ఈ ఆటలను “డైస్” తో ఆడుతున్నారు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే “చెమ్మ” అనీ, నాలుగూ బోర్లా పడితే “అష్ట” అనీ అంటారు. “చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

వైకుంఠపాళి ఆటనే ఇప్పటి పిల్లలు Snakes & Ladders పేరుతో ఆడుతున్నారు. కానీ నాకు ఇప్పటి గట్టి అట్టపై రంగురంగుల గళ్ళతో, చిన్నగా ఉండే బోర్డుకన్నా, నలుపు, తెలుపు రంగులలో, పెద్దగా, “పరమపద సోపాన పటము” అని రాసిఉండే పాత కాగితం పటమే ఎంతో ఇష్టం. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డువరుసకు 10 గళ్ళ చొప్పున ఉంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. నప్పు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, ఆ పాము మింగటం చేత, ఆ గడి నుంచీ పాము తోక ఉన్న గడి దాకా నప్పు దిగజారవలసి ఉంటుంది. అదే, నప్పు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, ఆ నిచ్చెన ఎక్కడం ద్వారా, నిచ్చెన పై చివర వరకూ చేరుకోవచ్చు. పాములను దాటుకొంటూ, నిచ్చెనలు ఎక్కుకొంటూ, 100వ గడికి ముందుగా చేరుకొన్నవాడే విజేత. ఇప్పటికీ, 94వ గడినుంచీ అనుకొంటా, అట్టడుగు వరుస వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పామును తలచుకొంటే, ఎన్నిసార్లు ఆ పాము బారిన పడి ఆటను కోల్పోయామో గుర్తుకువచ్చి నవ్వు వస్తుంది.

ఇక ఇదే కోవలొకి వచ్చే మరో ఆట “అష్టా-చెమ్మ”. దీనినే “గవ్వలాట” అనికూడా అంటారు. ఇది ఇప్పటి తరం వారు ఆడే “Ludo” ఆటను పోలి ఉంటుంది. ఈ ఆటకు కావలసిన పటాన్ని అరుగుమీద గీసుకొనే వాళ్ళం. దీనికి నీటితో తడిపిన సుద్దముక్కను ఉపయోగించే వాళ్ళం. ఈ పటం 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆటలో నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో “X” గుర్తు వేసి ఉంటుంది. ఇందులో ఆ ఆటగాడికి చెందిన నాలుగు నప్పులు ఉంటాయి. ఇది ఆ ఆటగాడి “ఇల్లు” అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ “X” గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ అపసవ్య దిశలో నడుపుకొంటూ, చివరకు మధ్యలో “X” గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది. ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట. మా బామ్మ ఈ ఆటను, తన స్నేహితురాళ్ళతో ఇంటి అరుగుల మీద కూర్చొని ఆడుతూ ఉండేది. ఆవిడకు అత్యంత ఇష్టమైన ఆటలు గవ్వలాట మరియు పేకాట. ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి చాలాకాలం అయినా, గవ్వలు పేరు చెప్పగానే మా ఇంట్లో అందరికీ ఆవిడే గుర్తుకు వస్తుంది…!!

ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

నేను ఈ మధ్య నెల రోజులకై ఇండియా వెళ్ళినప్పుడు, అంతటి హడావిడిలోనూ, తీరిక చేసుకొని మూడు పుస్తకాలు చదువగలిగాను.

ఎప్పటినించో నేను చాణక్యుడి గురించి వినడమే గానీ, అతని చరిత్ర గురించి తెలియదు. అర్థశాస్త్రం రచించాడనీ, చంద్రగుప్తుడిని రాజును చేయడంలో తెరవెనుక పాత్ర పోషించాడనీ, నందరాజ్య నిర్మూలనకై శపథం చేసాడనీ.. ఇలా పైపైన వివరాలు తప్ప, పూర్తి కథ తెలియదు. అందుకే రాజమండ్రి పుస్తక ప్రదర్శన లో “ఆర్య చాణక్య” అనే పుస్తకం కనపడగానే కొనివేసాను. “తాడంకి వేంకట లక్ష్మీ నరసింహరావు” గారు మొత్తం కథను ఉత్కంఠభరితంగా, నాటకీయ ఫక్కీలో, కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వర్ణించారు. న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతటి కుటిలమార్గమైనా అవలంబించడంలో తప్పులేదనీ, న్యాయాన్ని అందివ్వనప్పుడు అది ఎంత ధర్మమార్గమైనా అనుసరించరాదనీ ఉదాహరణలతో సహా వివరించారు. అందులో ఒక ఉదాహరణ ఇలా ఉంది. చాణక్యుని శిష్యుడైన ఒక బాలుడు అడవిలో చెట్టు కింద విశ్రాంతి తీసుకొంటూండగా, ఒక ఆవు, బెదరుతూ, ఎవరో తరుముకొస్తున్నట్టుగా అటు వైపుగా వస్తుంది. ఆ బాలుడు నెమ్మదిగా ఆ ఆవును పక్కకు తోలుకుపోయి, ఎవరూ చూడని ప్రదేశంలో దాచివేసి, మరల చెట్టు కింద కూర్చొంటాడు. ఇంతలోనే ఆ ఆవుకై వెతుకుతున్న కసాయివాడు అటుగా వచ్చి, ఆవు గురించి ప్రశ్నిస్తాడు. ఆ బాలుడు ఎక్కడా తొణకకుండా, నిబ్బరంగా, అసలు ఏ ఆవూ ఇటుగా రాలేదని అబద్ధం చెప్తాడు. కసాయివాడు వేరే దిక్కుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ బాలుడిని, “సత్యమునే పలుకవలెను” అనే ధర్మాన్ని ఎందుకు పాటించలేదని నిలదీస్తాడు. దానికి ఆ బాలుడు, “నేను సత్యమే పలికి ఉంటే, ఆ ఆవు ఈసరికి కసాయివాని చేతిలో హతమై ఉండేది. న్యాయాన్ని అందివ్వడానికి, ధర్మాన్ని పాటించకపోయినా తప్పులేదని మా గురువులు చాణక్యులు చెప్పారు. ఆ ఆవుకు న్యాయం చేకూర్చడానికే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది” అని సమాధానమిస్తాడు. ఇటువంటి ఉదాహరణలు ఈ కథలో ఎన్నో ఉన్నాయి. సామ్రాజ్య విస్తరణకై రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు పారించి, ఎందరో సైనికుల ప్రాణాలు బలిగొనే కన్నా, భేదోపాయం ఉపయోగించి, శత్రువుల మధ్య విభేదాలు సృష్టించి, వారి వేలితో వారి కన్నునే పొడుచుకొనేలా చేయడమే చాణక్యనీతి. చంద్రగుప్తుడిని మౌర్యసామ్రాజ్యాధీశుడిని చేసే క్రమంలో వేసిన ఎత్తులు, పై ఎత్తులు, అలెగ్జాండర్ అంటటివాడినే ఎదురొడ్డి నిలచిన ధైర్యసాహసాలు, ఇలా చాణక్యుడిలోని ఎన్నో పార్శ్వాలను రసవత్తరంగా కళ్ళముందుంచింది ఈ పుస్తకం. కొసమెరపు ఏమిటంటే, చాణక్యుడికే “వాత్స్యాయనుడు” అనే మరో పేరు ఉందనీ, “వాత్స్యాయన కామ సూత్రాలు” ఆయన రచించినవే అనీ తెలిసి ఆశ్చర్యం వేసింది.

నేను చదివిన మరో పుస్తకం “శ్రీ ఇచ్ఛాపురం రామచంద్రం” గారు రచించిన “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి”. “అపూర్వ చింతామణి” అనే రాకుమారి, తన గురువు ఇచ్చిన సలహాపై, తన స్వయంవరానికై ఒక వ్రతాన్ని ఆచరిస్తుంది. స్వయంవరానికై వచ్చిన రాకుమారులలో, తను అడిగే అయిదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగన రాకుమారుడినే ఆమె వరిస్తుంది. కానీ, ఒకవేళ సరిఅయిన సమాధానాలు చెప్పలేకపోతే, తన కత్తితో ఆ రాకుమారుడి శిరస్సు ఖండించి కోటగుమ్మానికి వ్రేలాడదీయిస్తుంది. ఈ విధంగా, ఆమెను స్వయంవరంలో ఓడించడానికై వచ్చి వెయ్యిమంది రాకుమారులు ఆమె కరవాలానికి బలి అయిపోతారు. ఇంతకీ అంత క్లిష్టమైన ఆ అయిదు ప్రశ్నలు ఏమిటి..? వాటివెనుక మర్మం ఏమిటి..? ఎవరైనా ఆ ప్రశ్నలకు సమధానం చెప్పగలిగారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే, ఎంతో ఉత్కంఠతో సాగిపోయే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే.

ఇక నేను చదివిన మరో మంచి పుస్తకం, “స్వామి వివేకానందుడు” చే రచింపబడిన “రాజ యోగ” అనే ఆంగ్ల పుస్తకం. రాజయోగంలోని ముఖ్యభాగాలైన యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధిలను గురించి క్లుప్తంగా, అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరింపబడింది. వెన్నుముక దిగువభాగంలో, మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉండే కుండలినీ శక్తి గురించి, ఆ శక్తిని మెదడులో వేయి రేకులతో వికసించే పద్మాన్ని పోలివుండే సహస్రార చక్రానికి తీసుకుపోయే ఇడ, పింగళ నాడుల గురించి, ఆ క్రమంలో జరిగే పరిణామాల గురించీ చక్కగా వివరించారు. మనిషి బయట చూసే ప్రపంచానికన్నా విశాలమైన ప్రపంచం మనిషి లోపల కూడా ఉందనీ, రాజయోగ సాధన ద్వారా ఆ ప్రపంచాన్ని చూడవచ్చనీ, దానికి సాధన ఎంతో ముఖ్యమనీ వివరింపబడింది. సైన్స్‌కీ, అధ్యాత్మికతకూ ముఖ్య భేదాన్ని కూడా వివేకానందుడు చక్కగా వివరించాడు. నిరూపింపబడేంతవరకూ దేనినీ నమ్మదు సైన్స్. కానీ, ముందు నమ్మకం ఉంచితే, నిజం నీకే అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది ఆధ్యాత్మికత. ఈ పుస్తకంలో చెప్పినవి మన అనుభవంలోకి రావాలంటే ఎన్నో సంవత్సరాల సాధన అవసరం. అది ఈ బిజీ జీవితంలో ఎంతవరకూ సాధ్యమో తెలియదుగానీ, ప్రతీ వ్యక్తీ కనీసం ఒకసారి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. తీరిక దొరికినప్పుడు తప్పక చదవండి.

చిన్ననాటి ఆటలు – వీపు చట్నీలు

విరామ సమయాన్ని సూచిస్తూ మా పాఠశాల ప్యూను సత్తిరెడ్డి గంటను గణగణా మోగించాడు. పుట్టల్లోంచి చీమలు బయటకు వచ్చినట్టు విద్యార్థులందరూ వారి తరగతి గదులనుంచి బయటకు పరుగుపెడుతున్నారు. నేను అప్పటివరకూ రాసిన నోటు పుస్తకాన్నీ, పాఠ్య పుస్తకాలనీ సంచిలో సర్దుకుంటున్నాను. ఇంతలో నాకు వీపు చుర్రుమని, నొప్పి తలకెక్కడంతో స్పృహలోకి వచ్చాను. నా వీపుకు తగిలిన రబ్బరు బంతి నాలుగు బెంచీల అవతలకి పోయి ఏమీ ఎరగని దానిలా అమాయకంగా ఒక మూల దాక్కుంది. గిరుక్కున వెనక్కి తిరిగి చూసేసరికీ, అప్పటికే బయటకు వచ్చేసిన ‘ఎ సెక్షన్ ‘ కంకిపాటి శ్రీను, చెక్కా నాగేశ్వరరావు, పళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ నన్ను గేలి చేస్తున్నారు. అప్పుడర్థమైంది.. వాళ్ళు ‘వీపు చట్నీ’ ఆటకై నన్ను కవ్విస్తున్నారని. రెట్టించిన కసితో, ఉత్సాహంతో మూలన పడ్డ బంతిని తీసుకొని నేను కూడా వారి వెంటబడ్డాను. నాకు దొరకకుండా వాళ్ళు తుర్రుమన్నారు. విరామ సమయం పదినిముషాలే అయినా, అంతలోనే మా పాఠశాలలో ఉన్న గదులన్నింటినీ రెండు మూడు సార్లైనా చుట్టేసి ఉంటాం. ఆ సమయంలో మా లక్ష్యం అంతా, మన వీపు మీది చుర్రుమనే మంట పోయేలోపు, ఎదుటివాడి వీపును ఎంత విమానం మోత మోగిద్దామా అనే..!! విరామం పూర్తి అయ్యి, ఎవరి తరగతి గదులకు వారు చేరుకునేసరికీ చెమటతో చొక్కా మొత్తం తడిసి వీపుకు అతుక్కుపోయేది. ఇంకుపెన్నుతో, అక్షరాలు అలుక్కుపోతుండగా, తరువాతి క్లాసులో నోట్సు తీసుకోవడం ఒక మరపురాని అనుభూతి.

ఈ ‘వీపు చట్నీలు ‘ ఆటకి నియమాలు అంటూ ఏవీ ఉన్న గుర్తులేదు. ఎవరికి బంతి దొరికితే వాడు ఎవరో ఒకరి వీపుకి గురి చూసి దాన్ని ‘ చట్నీ ‘ చెయ్యడమే..!! ఎదుటివాడి బంతికి మన వీపు చిట్లకుండా కాచుకొంటూ, తప్పించుకొంటూ, అవతలివాడిపై దాడి చేసేందుకు ఎత్తులు, జిత్తులు పన్నుతూ ఎంతో వేగంగా సాగిపోతుందీ ఆట. ఈ ఆటకు జనం రారన్న బెంగలేదు. మనం ఎవరిని ఆటలో కావాలనుకొంటున్నామో, వారి వీపు మోగేటట్టుగా ఒఖ్ఖటిస్తే, ఆ కసి తీర్చుకోవడానికన్నా చచ్చినట్టు వచ్చి ఆటలో కలిసేవారు. ఈ ఆట ఆడేటప్పుడు ఎన్నోసార్లు బంతి ఏ బురదలోనో, మురికిగుంటలోనో పడేది. అదేమీ పట్టించుకోకుండా, బంతిని తీసి, రెండు మూడు సార్లు ఏ ఇసుకలోనో, దుమ్ములోనో పొర్లించి, గట్టిగా గోడకేసి కొడితే, మరలా ఆటకు తయార్. మా పాఠశాలలో ఆగస్టు పదిహేనున తెల్లటి వెల్లతో వేసిన గోడలన్నీ ఈ బంతి ముద్రలతో నిండిపోయేవి. ఈ మురికి బంతి తగిలి మా చొక్కాలపై కూడా బంతి ముద్రలు స్పష్టంగా పడడం, ఇంటికెళ్ళాకా “నీ చొక్కాలు ఉతకడం నా..వల్ల కాదు..!!” అంటూ అమ్మ చేతుల్లో తన్నులు, చీవాట్లు తినడం రివాజుగా ఉండేది. అయినా, ఈ “వీపు చట్నీలు” ఆట అనుభవాల ముద్రలు మాత్రం ఇప్పటికీ నా మనసులో చెరగకుండా అలానే ఉన్నాయి.

చిర్రెత్తించిన “చిరుత”

ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు.

చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” అన్నట్లు ఏడవలేక వచ్చే నవ్వులు చాలాసార్లు వినిపించాయి.

కథ విషయానికి వస్తే, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడం, తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, పొగరుబోతు హీరోయిన్ తిక్క కుదిర్చి ప్రేమాయణం సాగించడం.. ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు..? కొడుకు కెరీర్‌ను శ్రద్ధగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, తన కొడుకు తొలి సినిమాకు ఇంత మూస కథను ఎన్నుకోవడం విచిత్రమే.

ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం పెద్ద మైనస్. పాటలు ఎక్కడా వినసొంపుగా లేవు. చిరంజీవి కొడుకు సినిమా కనుక పాటలు ఆ మాత్రం అన్నా పాపులర్ అయ్యాయి. చిరంజీవితో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ, ఈ చిత్రానికి ఇంత నాసిరకం సంగీతాన్ని అందించాడంటే ఆశ్చర్యమే. 

ఇక చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలందరికీ హీరోయిన్లను ఎన్నుకోవడంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల ఇటీవలి సినిమాలకు హీరోయిన్‌లు ఎంత మైనస్ అయ్యారో తెలిసిన విషయమే. అదే జాడ్యం ఈ సినిమాకూ పట్టుకొంది. ఒక్కోసారి హీరోయిన్‌ను మిగిలిన స్నేహితురాళ్ళతో కలిపి చూపిస్తే గుర్తించడమే కష్టం అయ్యింది.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, ఎంత చెత్త సినిమానైనా “ఏరా”, “ఒరే”, “ఏమ్మా”, “పోమ్మా” లాంటి మాస్ పదాలతో లాగించేయచ్చనే కాన్‌ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది.  ఇందులోనూ హీరో, హీరోయిన్ల మధ్యన అతి సంభాషణా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాల్లో ఈ సంభాషణలు క్లిక్ అయినా, ప్రతీ సినిమాకీ అదే కొనసాగిస్తే ఎప్పుడో ప్రేక్షకులు తిప్పికొడతారన్న విషయం పూరీ గుర్తించాలి. అదే విధంగా క్లాస్ సినిమాగా తీయాలా, లేక మాస్‌ను ఆకర్షించాలా అనే విషయంలో కూడా పూరీ కన్‌ఫ్యూజన్ స్పష్టంగానే కనిపించిపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ కొన్నిచోట్ల “సూపర్” సినిమాను తలపించింది. ముఖ్యంగా వాటర్ స్కూటర్ ఫైట్ అయితే “సూపర్” క్లైమాక్స్ సన్నివేశాన్నే గుర్తుకు తెచ్చింది.

ఈ సినిమాలో కొద్దో గొప్పో హాస్యం అంటే ఆలీ గూర్చే చెప్పుకోవాలి. “యు వాంట్ థాయ్ మస్సా..” అంటూ పర్యాటకులను మసాజ్‌తో ఆకట్టుకొనే ఆడ బ్రోకర్ పాత్రను పోషించాడు. ఆలీకి ఆడవేషం కొత్త కాకపోయినా, సాధ్యమైనంత వరకూ కొత్త మేనరిజంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇక అమెరికాలో, చిరంజీవి ఇమేజ్‌ను సొమ్ముచేసుకోవడానికి టిక్కెట్టు రేటును 15 డాలర్లు చేయడం కోపం తెప్పించింది. ఈ మధ్య అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో రేట్లు కూడా బాగా గుంజి జనాలను దోచుకొంటున్నారు.

చివరిగా, రాంచరణ్ నటన ఫరవాలేదు. ఎక్కడా మొదటి సినిమా అన్న బెరకు కనిపించలేదు. డైలాగ్ డెలివరీ కొంత మెరగుపరచుకోవలసి ఉంది. డాన్స్‌లు, ఫైట్‌లు భాగా చేశాడు. కానీ, నటనలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల ఛాయలు కనిపించాయి. వాటిని పోగొట్టుకొని సొంత స్టైల్‌ను అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రాంచరణ్ రెండవ సినిమా రాజమౌళితోనట. హింస, అశ్లీలతలపై ఆధారపడి పబ్బం గడుపుకొనే రాజమౌళి చేతిలో పడితే మాస్ మూసలో పడి ఇతని భవిష్యత్ కొట్టుకుపోవడం ఖాయం. ఇటువంటి దర్శకులను ఎన్నుకొనేబదులు, కథాబలం గల సినిమాలు తీస్తూ టాలెంట్ పుష్కలంగా గల “శేఖర్ కమ్ముల”, “చంద్ర శేఖర్ యేలేటి”, “శేఖర్ సూరి”, “చంద్ర సిధ్ధార్థ” లాంటి దర్శకుల చేతిలో పడితే ఇతని భవిష్యత్‌కు ఇంకా ఉపకరిస్తుందని నా అభిప్రాయం.                 

అంతగా ఆకట్టుకోలేకపోయిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

సిలికానాంధ్ర సంస్థ ప్రతీ సంవత్సరం ఆంధ్ర సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా నిన్న, అనగా అక్టోబర్ 6వ తారీఖున సాంస్కృతికోత్సవాన్ని జరుపుకుంది. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వివరాలలోకి వెళ్తే..

సిలికానంధ్ర సాంస్కృతికోత్సవాలకు ముఖ్య ఆకర్షణ కూచిపూడి నృత్యరూపకం. 2005లో “ఉషా పరిణయం”, 2006లో “ధృవ చరితం” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. ఎప్పుడూ కూచిపూడి నృత్యానికి పెద్దపీట వేసే సిలికానాంధ్ర ఈసారి ఎందుకో చిన్నచూపు చూసింది. “స్వరాభినయ సారస్వం” అనే కార్యక్రమం ఉన్నా, మొత్తం రంగస్థలం గాయనీగాయకులతో నిండిపోవడంతో, కూచిపూడి నర్తకీమణులకు నర్తించడానికి సరిపడినంత చోటు లేకపోయింది. గతంలో 45 నిమిషాలనుండీ గంట వరకూ కథాపరంగా, వివిధ సన్నివేశాలు, దానికి తగిన పరదాలు, హంగులు, సెట్టింగులతో సాగిన నృత్యరూపకాలతో పోలిస్తే, వివిధ త్యాగరాజ కృతులతో పది పది నిమిషాలుగా సాగిన కూచిపూడి నృత్యం ఎందుకో నన్ను అంత ఆకట్టుకోలేకపోయింది. “జగదానందకారకా..” అనే కృతి మాత్రం ఎంతో వీనులవిందుగా ఉంది.

ఈ సంవత్సర కార్యక్రమాల్లో మరో ముఖ్య కార్యక్రమం “జగమంత జనని”. తల్లి ప్రేమను మరోసారి అందరికీ గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఓలేటి పార్వతీశంగారు సాహిత్యం అందించిన ఈ సంగీత నృత్యరూపకంలో ఏడు విధాలైన తల్లిప్రేమను చూపించారు. జన్మనిచ్చిన తల్లి, పెంచిన తల్లి, గోమాత, బ్రాహ్మణి, గురుపత్ని, రాజమాత, భూమాత లలో మాతృత్వాన్ని హరివిల్లులోని ఏడు రంగులతో పోలుస్తూ కార్యక్రమం సాగింది. దృశ్యాపరంగా చూస్తే ఈ కార్యక్రమం ఎంతో బాగుంది. రంగస్థల ముందు భాగంలో చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే, వెనుక అమ్మ పాత్రలోని మహిళ, పాపను ఎత్తుకొని లాలించడం, ఆమెపై ఫ్లాష్‌లైట్ పడి, ఆ నీడ వెనుక పరదాపై పడడం, ఎంతో ఆకట్టుకొంది. అదేవిధంగా పిల్లలు నృత్యంచేస్తుంటే, వారి అమ్మలు వచ్చి వారిని ముద్దాడి గుండెలకు హత్తుకోవడం, ఇద్దరు పిల్లలు గోమాత రూపంలో వచ్చి నాలుగు కాళ్ళతో నర్తించడం, చివరిలో భారతీయ జెండాను ప్రదర్శించడం చాలా బావుంది. నిజానికి ఈ కార్యక్రమం జనాలను ఎంతగానో ఆకట్టుకొని ఉండాలి. కానీ సౌండ్ సిస్టం సమస్యో లేదా రికార్డింగ్ లోపమో తెలియదుకానీ, ఈ కార్యక్రమానికి ఆయువుపట్టయిన సాహిత్యం సరిగా వినబడనే లేదు. దానితో రావలసినంత ఫీల్ రాలేదు. వ్యక్తిగతంగా చూస్తే, గత సంవత్సరం జరిగిన “సరిగంచు చీర” కార్యక్రమం ఆకట్టుకొన్నంతగా ఈ కార్యక్రమం  ఆకట్టుకోలేకపోయింది.

ఇక హాస్య నాటిక విషయానికి వస్తే, చాయా చిత్రాన్నీ, రంగ స్థలాన్నీ కలిపి “ఛాయారంగం” కార్యక్రమంతో విన్నూత్న ప్రయోగం చేసినందుకు సిలికానాంధ్రను అభినందించాలి. వెనుక వీడియో క్లిప్పింగ్‌లో వస్తున్న పాత్రలను వాస్తవంగా భావిస్తూ, దానికి ప్రతిస్పందించడం పాత్రధారులకు కత్తిమీద సామే. దీనికి, వెనుక వీడియో క్లిప్పింగ్ నడుపుతున్నవారికీ, ముందు నటిస్తున్న వారికీ మధ్య ఎంతో సమన్వయం ఉండాలీ. లేకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. ఈ సాహస ప్రయోగంలో  చాలావరకూ సిలికానాంధ్రవారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. కానీ, ఇంత కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించినవారు కథాపరంగా తగిన శ్రద్ధ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. కథలో హాస్యంపాలు చాలా తక్కువగాను, చాలా సన్నివేశాలు అసహజంగాను ఉన్నాయి. క్రితం సంవత్సరం “బాబోయ్ సెల్‌ఫోన్” హాస్యనాటికతో పోలిస్తే “చాయారంగం” తేలిపోయిందనే చెప్పాలి.

ఇక మరో కార్యక్రమం జానపద నృత్యరూపకం “ధినాక్ ధిం ధిం”. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొన్న ఈ కార్యక్రమంలో హరిదాసు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, బావా మరదళ్ళ సరసాలతో కూడిన పాటలు, దంపుళ్ళ పాటలు ఇలా దాదాపు కనుమరుగైపోతున్న జానపద పాటలను గుర్తుచేసే ప్రయత్నం చేసారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తయారు చేసిన సెట్టింగులు, ఏనుగు బొమ్మ, ఎంతో ఆకట్టుకొన్నాయి. నర్తించినవారు కూడా ఆద్యంతం ఎంతో చలాకీగా, హుషారుగా నాట్యం చేసారు. కానీ ఈ కార్యక్రమంలోనూ సౌండ్ సిస్టం సమస్య వల్ల సాహిత్యం సరిగా వినబడకపోవడం లోటే.  

చివరిగా చెప్పుకోవలసినది “చాణక్య శపథం” నాటకం. చాణక్యుడిగా “దిలీప్ కొండిపర్తి” గారి అభినయం చాలా బాగుంది. ఆరంభంలో కొంత తడబడ్డా, చివరిలో ఏకబిగిన 4-5 నిమిషాలపాటు, ఆవేశంతో సాగే సంభాషణలను ఎంతో రక్తి కట్టించారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ రౌద్రాన్ని సూచిస్తూ ఎరుపు రంగులోకి మారటం ఎంతో ఆకట్టుకొంది. కానీ, ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతంగా కథని సంక్షిప్తంగా వివరించివుంటే ఇంకా బాగుండేదని అనిపించింది.

ఇక ప్రేక్షకులను అసహనానికి గురిచేసినవి కొన్ని ఉన్నాయి. ప్రతీ కార్యక్రమానికీ మధ్య దాతలను సన్మానించడం, లేక మేయర్లను సన్మానించడం, సిలికానాంధ్ర గొప్పతనాన్ని వివరించడం వంటివి విసుగు తెప్పించాయి. ముందు కార్యక్రమంలో పొందిన తృప్తి, ఆనందం వంటివి మధ్యలో వస్తూ ఉన్న ఈ విరామాలవల్ల ఆవిరయిపోయాయి. వీటిని కుదించి, ఒకేసారి కానిచ్చి ఉంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పేది. వీటిలో కూడా సమన్వయ లోపాలు కనిపించాయి. చెప్పిన విషయాన్నే మరల మరల ఇద్దరు ముగ్గురు చెప్పడం, పిలిచిన దాతలనే మరల పిలవడం, వారి పేర్లను తప్పుగా పరిచయం చేయడం, సన్మానించవలసిన వారి పేర్ల చిట్టా ముందుగా సిద్ధం చేసుకోక పోవడం, ఒక్కోసారి ఒక్క సిలికానాంధ్ర సభ్యుడు కూడా లేకుండా స్టేజిమీద అతిథులను వదిలివేయడం, ప్రేక్షకులను పదే పదేదే అడిగి చప్పట్లు కొట్టించుకోవడం, స్టేజీ కిందనుంచి స్టేజీ పైన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి సమాచారం పంపిస్తూ సమచారలోపాన్ని బహిర్గతం చేసుకోవడం, కార్యక్రమం చివరిలో కూడా వీడ్కోలు పలకాలా లేక గుర్తించవలసినవారెవరైనా మిగిలిపోయారా అన్న సందేహంలో ఉండిపోవడం ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యనిర్వహణాలోపాలు ఈసారి కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా పకడ్బందీ ప్రణాళిక కావాలి. అది ఈసారి ఎందుకో సరిగా జరగలేదు. గత సంవత్సరాలలో తాను నెలకొల్పుకొన్న ప్రమాణాలను తానే అందుకోలేకపోయింది ఈసారి సిలికానాంధ్ర. ఇక ఈ సారి కార్యక్రమాల్లొ, గతసారి జరిగినట్లుగా ఏ తెలుగు ప్రముఖులనీ సన్మానించుకోలేకపోవడం కూడా ఒక లోటే.
  

  
       

కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

ఎవరినైనా “నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఏవి..?” అని ప్రశ్నిస్తే, చాలామంది చెప్పే సమాధానం “కాలేజీ రోజులు” అనే. అదే ఆ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఆ అనుభూతులే ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే రెండున్నర గంటల సినిమాగా మలచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

కథ విషయానికి వస్తే, నాలుగు జంటల ఇంజనీరింగ్ కాలేజీ  అనుభవాలే “హ్యాపీ డేస్”. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు రోజూ ఎదురయ్యే అన్ని అనుభవాలనీ రంగరించి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. కాలేజీ తొలినాళ్ళలో ఎదురయ్యే ర్యాగింగ్ అనుభవాలు, పొగరుగా ప్రవర్తించే జూనియర్ల కొమ్ములు వంచే సీనియర్లు, కొత్త పరిచయాలు, ఫ్రెషర్స్ పార్టీ, సంవత్సరమంతా ఎంజాయ్ చేసి చివర్లో నైట్అవుట్‌లతో, కాపీలతో గట్టెక్కే విద్యార్థులు, ఆ వయస్సులో క్లాస్‌మేట్, సీనియర్, లెక్చరర్ అన్న బేధం లేకుండా ఆపోజిట్ సెక్స్ పై కలిగే ఆకర్షణ, ప్రేమ, స్నేహితుల మధ్య చిన్న చిన్న పంతాలు, పట్టింపులు, కష్టసుఖాలను పంచుకోవడం, చివరిగా ఫేర్‌వెల్ పార్టీ సమయానికి కళ్ళు చెమర్చడం.. ఇలాంటి అన్ని అనుభవాలకు దృశ్యరూపమే “హ్యాపీ డేస్”.

ఈ సినిమాలోని నటీనటులందరూ కొత్తవారే. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకుగా నటించిన “రాజేష్” పాత్రధారి నటనలో ఈజ్ బావుంది. సీనియర్ అమ్మాయి “స్రవంతి” కూడా భావాలను బాగా ప్రదర్శించింది. కమలినీ ముఖర్జీ ఒక యంగ్ లెక్చరర్‌గా తళుక్కుమంది. విద్యార్థులకు యంగ్ లేడీ లెక్చరర్లపై ఉండే ఆకర్షణను మోతాదు మించకుండా చిత్రీకరించడం, ఆ లెక్చరర్ పాత్రకు కమలినీను ఎన్నుకోవడం శెఖర్ కమ్ముల పరిణతిని చూపించింది. సినిమాలో కమెడియన్లు ఎవ్వరూ లేకపోయినా, శేఖర్ కమ్ముల రాసిన సంభాషణలు, ప్రేక్షకుల పెదవులమీద చిన్న చిరునవ్వును మొదటినుంచీ చివరివరకూ చెరగకుండా చేసాయి.

ఇక సంగీతం విషయానికి వస్తే, రాధాకృష్ణన్‌ను కాక, మిక్కీ జీ మేయర్‌ను ఎంచుకొని దర్శకుడు మంచిపని చేసాడనిపించింది. పాటలన్నీ శ్రావ్యంగా ఉండడమే కాక, చిత్రీకరణపరంగా కూడా బాగున్నాయి.

ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన గురించి చెప్పాలి. చిరంజీవి కొడుకు నటించిన “చిరుత” కూడా ఇదే సమయంలో విడుదల అవటంచేత ఈ సినిమా థియేటర్ ఖాళీగా ఉంటుందని ఊహించిన నా అంచనా తప్పయ్యింది. బారులు తీరిన క్యూచివర్లో నుంచుని, ముందునుంచి రెండో వరుసలో కూర్చొని, సినిమా చూడవలసి వచ్చింది 🙂 సినిమా సాగుతున్నంత సేఫూ జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేసారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న ఆదరణ ఈ చిత్రంతో మరోసారి రుజువయ్యింది.

వ్యక్తిగతంగా చూస్తే, నాకు “ఆనంద్”, “గోదావరి” చిత్రాలకన్నా ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బావున్నట్టు అనింపించింది. సినిమాలో కథ ఏమీ లేకుండా రెండున్నర గంటలు నడపడమంటే కత్తిమీద సామే. ఈ సినిమాలో కూడా కొన్ని అవసరం లేని సన్నివేశాలు, సాగదీయబడిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే ఈ సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా చూడచ్చు.

తెలుగులో ఈ మధ్యకాలంలో కాలేజీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు రాలేదు.  “హృదయం”, “ప్రేమదేశం” లాంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలయినా ఎంత సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులందరూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అయినా తమని తాము అయిడెంటిఫై చేసుకొంటే, ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట

మా చిన్నతనంలో ఇష్టపడి ఆడిన మరొక ఆట: ఏడు ఫెంకులాట. నా ఏడో తరగతి సమయంలో క్రికెట్ పిచ్చి తగులుకోక ముందు వరకూ ఈ ఆట ఆడడానికి ఎంతో ఉత్సాహపడే వాళ్ళం. ఈ ఆటని మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం వెనుక ఉన్న ఖాళీస్థలం లో ఆడేవాళ్ళం. ఈ ఆట గురించి పరిచయం లేని వారి గురించి కొంచెం వివరిస్తాను.

ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. టాస్ అంటే బొమ్మ-బొరుసు అనుకొనేరు. అంత సీనేం లేదు. అప్పట్లో ఈడ్చి తంతే మా జేబులోంచి ఒక్క పైసా కూడా రాలేది కాదు. అందుకే, ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి టాస్ వేసేవాళ్ళం. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు. ఈ టాస్ ను వేయడానికి మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మరెప్పుడైనా వివరిస్తాను.

ఇక ఆట విషయానికొస్తే, టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

బంతితో ఒకరిని కొట్టినప్పుడు అవతలి వ్యక్తి దానిని మోచేతులతో లేదా మోకాళ్ళతో అడ్డుకోవచ్చు. ఈ భాగాలలో బంతి తగిలినా లెక్కలోకి రాదు. పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది. ఈ ఆట ఆడి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, తలచుకొంటే ఇప్పటికీ ఆ చప్పట్లు చెవిలో రింగుమంటుంటాయి..!!

     

ఒంటరితనం

మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.

లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.

అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.

సల్మాన్ కు ఫత్వా..!!

నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు కాకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రామసేతు విషయంలో రేగిన దుమారం అందరికీ తెలిసిందే. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా, కనీసం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా పరిగణించి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది. ఇలాంటి అద్భుతమే ఏ అమెరికాలోనో ఉంటే ఈ పాటికి ఏ సబ్‌మెరైన్లలోనో పర్యాటకులను తిప్పి చూపించి ప్రపంచ ప్రాచుర్యం కల్పించేవారు. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని నాలుగు మాడ వీధులలోనూ ప్రతిష్ఠించాలనుకొంటున్న స్థంభాల నమూనాను టివిలో చూసాను. అది చూడడానికి అచ్చు శిలువ ఆకారంలో ఉంది. పైన ఎన్ని లతలను, నగిషీలను చెక్కినా దాని సహజ ఆకారం ఎక్కడికి పోతుంది..? టిటిడి వారు మాత్రం ఈ స్థంభాలు విజయనగరం కాలం నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేస్తున్నామనీ, దీనిని విమర్శించడం తగదనీ సమర్ధించుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొత్తం మీద, తమ మతాలను పరిరక్షించుకొనే విషయంలోముస్లిములది అతివృష్టి అయితే, హిందువుల పరిస్థితి అనావృష్టిగా తయారయింది. 

చిన్ననాటి ఆటలు: సబ్జా – విండూర్

నేను నా బ్లాగులో టపా వేసి వారం కావస్తోంది. తరువాత ఏమి రాద్దామా అని ఆలోచిస్తూండగా, నా చిన్నతనంలో మేమాడుకొన్న ఆటల గురించి రాస్తే బాగుంటుందనిపించింది. ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన ఈ ఆటల గురించి ఒక్క టపాలో రాస్తే సరిపోదనిపించింది. అందుకే ప్రతీ వారం ఒక్కొక్క ఆటని గుర్తు చేసుకొంటూ, ఆ జ్ఞాపకాలను ఈ బ్లాగులో పదిలంగా దాచుకోవాలని, తోటి బ్లాగు స్నేహితులతో  పంచుకోవాలని నిర్ణయించుకొన్నాను.

సాధారణంగా, మేమాడిన ప్రతీ ఆటలోనూ, క్రీడాకారులనుంచి ఒక “దొంగ” ను ఎన్నుకోవడం ఉండేది. “దొంగ” ను “పంటలు” అనే పద్ధతి ద్వారా ఎన్నుకొనేవాళ్ళం. ముగ్గురు లేదా అయిదుగురం ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకొని వృత్తాకారంలో నించుని అందరూ ఒకేసారి ఎవరి ఎడం అరచేతిలో వారి కుడి అరచేతిని, వెల్లకిలాగానీ, బోర్లాగానీ, ఎవరికి తోచినట్లు వారు ఉంచేవాళ్ళం. ముగ్గురిలో ఒకేలా వేసిన ఇద్దరు కాక మిగిలిన వారు “పంట” అయినట్టు. అదే విధంగా అయిదుగురిలో ఒకేలా వేసిన ఇద్దరు పంట అయినట్టు. చివరకు పంట కాకుండా మిగిలిన వారే దొంగ. ఒకవేళ ఇద్దరు మిగిలితే, అప్పటికే పంట అయిన వారు తోడుకు వచ్చేవారు.

ఇక నాకు చాలా ఇష్టమైన ఆటల్లో మొదటిది “సబ్జా – విండూర్”. పైన చెప్పిన విధంగా దొంగను ఎన్నుకొన్న తరువాత, దొంగ, కళ్ళు మూసుకొని అంకెలు లెక్కబెడతాడు. అతను కళ్ళు తెరిచేలోపు, మిగిలిన అందరూ దొంగకు కనబడకుండా ఎక్కడైనా దాక్కోవాలి (కొన్ని సరిహద్దుల లోపల). దొంగ, దాక్కున్న ప్రతీ ఒక్కరినీ కనుక్కొని, వారి పేరు చెప్తూ “విండూర్” అని అరవాలి. ఈ లోపుగా ఎవరైనా దొంగ వెనుకగా వచ్చి “సబ్జా” అని ముట్టుకొంటే, దొంగ మరల ఆటను మొదలుపెట్టవలసి ఉంటుంది. అలా కాక, దొంగ అందరినీ కనుగొనగలిగితే, మొదటగా విండూర్ అయిన వ్యక్తి మరుసటి ఆటకు దొంగగా ఉండవలసి వస్తుంది.

ఈ ఆటను నా ఎదురింటి స్నేహితుడు”కృష్ణ” ఇంటి పెరడులో ఆడేవాళ్ళం. దొంగకి దొరకకుండా ఉండడానికి, ధాన్యం గాదెలోనో, లేక గడ్డి మేటిలోనో దాక్కునే వాళ్ళం. ఆ దెబ్బకి ఒళ్ళంతా దురదలు వచ్చినా పట్టించుకోనంతగా ఆటలో లీనమైపొయేవాళ్ళం. ఇక దొంగని తప్పుదారి పట్టించడానికి రకరకాల యుక్తులు ఉపయోగించేవాళ్ళం. ముఖ్యంగా నేనూ, కృష్ణా, ఒకరి చొక్కాలు మరొకరు మార్చేసుకొని, దొంగకి పట్టుబడ్డట్టుగా వెనుకనుంచి కనబడేవాళ్ళం. ఒకవేళ చొక్కా ఆనుమాలుతో మనిషి పేరు చెప్పాడా, అతను మళ్ళా దొంగ పెట్టవలసిందే..!!   ఇంతే కాక, పెరట్లో ఉన్న మరుగుదొడ్లలో దూరి తలుపేసుకొని, లోపల కుళాయి తిప్పి, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్లు దొంగని భ్రమింప చేసేవాళ్ళం. తలుపు సందులోంచి దొంగ యొక్క కదలికలు గమనిస్తూ, అదను చూసుకొని, హఠాత్తుగా దాడి చేసి సబ్జా చెప్పేవాళ్ళం. లేదా, ఒకేసారి ముగ్గురు నలుగురు దొంగపై దూకి ఉక్కిరిబిక్కిరి చేసి, అతను తేరుకొని విడిగా విండూర్ చెప్పేలోపే ఎవరో ఒకరు సబ్జా చెప్పేసే వాళ్ళం.

ఒకసారి ఈ ఆట మొదలుపెడితే అసలు సమయమే తెలిసేది కాదు. సాయంకాలం అయిదు గంటలకు మొదలుపెట్టిన ఆట, చీకటిపడి మా అమ్మలు కేకలు వేసి, చెవి మెలితిప్పి ఇంటికి లాక్కుపోయే దాకా సాగేది. అలసిపోయి, చెమటతో ముద్దైన వంటిపై, నూతి దగ్గిర చన్నీళ్ళ స్నానం చేసి, అన్నం తిని పడుకొంటే, మరుసటి రోజు ఉదయందాకా వళ్ళు తెలిసేది కాదు.