చిన్ననాటి ఆటలు: వైకుంఠపాళి, అష్టా-చెమ్మా..!!

నేను చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తుతెచ్చుకొంటున్నప్పుడు, పరుగులు పెట్టి కిందపడి మోచేతులకీ, మోకాళ్ళకీ దెబ్బలు తగిలించుకొన్న ఆటలే కాక, బుద్ధిగా ఇంటిలో నీడ పట్టున కూర్చుని ఆడిన ఆటలు కూడా కొన్ని గుర్తుకువచ్చాయి. ముఖ్యంగా వేసవి సెలవల్లో, మండే రోహిణీకార్తె ఎండల్లో, మద్యాహ్న సమయాల్లో ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. వాటిల్లో ముందుగా గుర్తుకు వచ్చేవి వైకుంఠపాళి, అష్టా-చెమ్మా.

ఈ ఆటలు ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: నప్పులు, గవ్వలు. “నప్పు” ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. అప్పట్లో మేము చీపురు పుల్లలనీ, బలపాలనీ, రాళ్ళనీ, చింతగింజలనీ నప్పులుగా ఉపయోగించేవాళ్ళం. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. ఇప్పటి పిల్లలు ఈ ఆటలను “డైస్” తో ఆడుతున్నారు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే “చెమ్మ” అనీ, నాలుగూ బోర్లా పడితే “అష్ట” అనీ అంటారు. “చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

వైకుంఠపాళి ఆటనే ఇప్పటి పిల్లలు Snakes & Ladders పేరుతో ఆడుతున్నారు. కానీ నాకు ఇప్పటి గట్టి అట్టపై రంగురంగుల గళ్ళతో, చిన్నగా ఉండే బోర్డుకన్నా, నలుపు, తెలుపు రంగులలో, పెద్దగా, “పరమపద సోపాన పటము” అని రాసిఉండే పాత కాగితం పటమే ఎంతో ఇష్టం. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డువరుసకు 10 గళ్ళ చొప్పున ఉంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. నప్పు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, ఆ పాము మింగటం చేత, ఆ గడి నుంచీ పాము తోక ఉన్న గడి దాకా నప్పు దిగజారవలసి ఉంటుంది. అదే, నప్పు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, ఆ నిచ్చెన ఎక్కడం ద్వారా, నిచ్చెన పై చివర వరకూ చేరుకోవచ్చు. పాములను దాటుకొంటూ, నిచ్చెనలు ఎక్కుకొంటూ, 100వ గడికి ముందుగా చేరుకొన్నవాడే విజేత. ఇప్పటికీ, 94వ గడినుంచీ అనుకొంటా, అట్టడుగు వరుస వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పామును తలచుకొంటే, ఎన్నిసార్లు ఆ పాము బారిన పడి ఆటను కోల్పోయామో గుర్తుకువచ్చి నవ్వు వస్తుంది.

ఇక ఇదే కోవలొకి వచ్చే మరో ఆట “అష్టా-చెమ్మ”. దీనినే “గవ్వలాట” అనికూడా అంటారు. ఇది ఇప్పటి తరం వారు ఆడే “Ludo” ఆటను పోలి ఉంటుంది. ఈ ఆటకు కావలసిన పటాన్ని అరుగుమీద గీసుకొనే వాళ్ళం. దీనికి నీటితో తడిపిన సుద్దముక్కను ఉపయోగించే వాళ్ళం. ఈ పటం 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆటలో నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో “X” గుర్తు వేసి ఉంటుంది. ఇందులో ఆ ఆటగాడికి చెందిన నాలుగు నప్పులు ఉంటాయి. ఇది ఆ ఆటగాడి “ఇల్లు” అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ “X” గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ అపసవ్య దిశలో నడుపుకొంటూ, చివరకు మధ్యలో “X” గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది. ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట. మా బామ్మ ఈ ఆటను, తన స్నేహితురాళ్ళతో ఇంటి అరుగుల మీద కూర్చొని ఆడుతూ ఉండేది. ఆవిడకు అత్యంత ఇష్టమైన ఆటలు గవ్వలాట మరియు పేకాట. ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి చాలాకాలం అయినా, గవ్వలు పేరు చెప్పగానే మా ఇంట్లో అందరికీ ఆవిడే గుర్తుకు వస్తుంది…!!

ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

నేను ఈ మధ్య నెల రోజులకై ఇండియా వెళ్ళినప్పుడు, అంతటి హడావిడిలోనూ, తీరిక చేసుకొని మూడు పుస్తకాలు చదువగలిగాను.

ఎప్పటినించో నేను చాణక్యుడి గురించి వినడమే గానీ, అతని చరిత్ర గురించి తెలియదు. అర్థశాస్త్రం రచించాడనీ, చంద్రగుప్తుడిని రాజును చేయడంలో తెరవెనుక పాత్ర పోషించాడనీ, నందరాజ్య నిర్మూలనకై శపథం చేసాడనీ.. ఇలా పైపైన వివరాలు తప్ప, పూర్తి కథ తెలియదు. అందుకే రాజమండ్రి పుస్తక ప్రదర్శన లో “ఆర్య చాణక్య” అనే పుస్తకం కనపడగానే కొనివేసాను. “తాడంకి వేంకట లక్ష్మీ నరసింహరావు” గారు మొత్తం కథను ఉత్కంఠభరితంగా, నాటకీయ ఫక్కీలో, కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వర్ణించారు. న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతటి కుటిలమార్గమైనా అవలంబించడంలో తప్పులేదనీ, న్యాయాన్ని అందివ్వనప్పుడు అది ఎంత ధర్మమార్గమైనా అనుసరించరాదనీ ఉదాహరణలతో సహా వివరించారు. అందులో ఒక ఉదాహరణ ఇలా ఉంది. చాణక్యుని శిష్యుడైన ఒక బాలుడు అడవిలో చెట్టు కింద విశ్రాంతి తీసుకొంటూండగా, ఒక ఆవు, బెదరుతూ, ఎవరో తరుముకొస్తున్నట్టుగా అటు వైపుగా వస్తుంది. ఆ బాలుడు నెమ్మదిగా ఆ ఆవును పక్కకు తోలుకుపోయి, ఎవరూ చూడని ప్రదేశంలో దాచివేసి, మరల చెట్టు కింద కూర్చొంటాడు. ఇంతలోనే ఆ ఆవుకై వెతుకుతున్న కసాయివాడు అటుగా వచ్చి, ఆవు గురించి ప్రశ్నిస్తాడు. ఆ బాలుడు ఎక్కడా తొణకకుండా, నిబ్బరంగా, అసలు ఏ ఆవూ ఇటుగా రాలేదని అబద్ధం చెప్తాడు. కసాయివాడు వేరే దిక్కుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ బాలుడిని, “సత్యమునే పలుకవలెను” అనే ధర్మాన్ని ఎందుకు పాటించలేదని నిలదీస్తాడు. దానికి ఆ బాలుడు, “నేను సత్యమే పలికి ఉంటే, ఆ ఆవు ఈసరికి కసాయివాని చేతిలో హతమై ఉండేది. న్యాయాన్ని అందివ్వడానికి, ధర్మాన్ని పాటించకపోయినా తప్పులేదని మా గురువులు చాణక్యులు చెప్పారు. ఆ ఆవుకు న్యాయం చేకూర్చడానికే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది” అని సమాధానమిస్తాడు. ఇటువంటి ఉదాహరణలు ఈ కథలో ఎన్నో ఉన్నాయి. సామ్రాజ్య విస్తరణకై రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు పారించి, ఎందరో సైనికుల ప్రాణాలు బలిగొనే కన్నా, భేదోపాయం ఉపయోగించి, శత్రువుల మధ్య విభేదాలు సృష్టించి, వారి వేలితో వారి కన్నునే పొడుచుకొనేలా చేయడమే చాణక్యనీతి. చంద్రగుప్తుడిని మౌర్యసామ్రాజ్యాధీశుడిని చేసే క్రమంలో వేసిన ఎత్తులు, పై ఎత్తులు, అలెగ్జాండర్ అంటటివాడినే ఎదురొడ్డి నిలచిన ధైర్యసాహసాలు, ఇలా చాణక్యుడిలోని ఎన్నో పార్శ్వాలను రసవత్తరంగా కళ్ళముందుంచింది ఈ పుస్తకం. కొసమెరపు ఏమిటంటే, చాణక్యుడికే “వాత్స్యాయనుడు” అనే మరో పేరు ఉందనీ, “వాత్స్యాయన కామ సూత్రాలు” ఆయన రచించినవే అనీ తెలిసి ఆశ్చర్యం వేసింది.

నేను చదివిన మరో పుస్తకం “శ్రీ ఇచ్ఛాపురం రామచంద్రం” గారు రచించిన “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి”. “అపూర్వ చింతామణి” అనే రాకుమారి, తన గురువు ఇచ్చిన సలహాపై, తన స్వయంవరానికై ఒక వ్రతాన్ని ఆచరిస్తుంది. స్వయంవరానికై వచ్చిన రాకుమారులలో, తను అడిగే అయిదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగన రాకుమారుడినే ఆమె వరిస్తుంది. కానీ, ఒకవేళ సరిఅయిన సమాధానాలు చెప్పలేకపోతే, తన కత్తితో ఆ రాకుమారుడి శిరస్సు ఖండించి కోటగుమ్మానికి వ్రేలాడదీయిస్తుంది. ఈ విధంగా, ఆమెను స్వయంవరంలో ఓడించడానికై వచ్చి వెయ్యిమంది రాకుమారులు ఆమె కరవాలానికి బలి అయిపోతారు. ఇంతకీ అంత క్లిష్టమైన ఆ అయిదు ప్రశ్నలు ఏమిటి..? వాటివెనుక మర్మం ఏమిటి..? ఎవరైనా ఆ ప్రశ్నలకు సమధానం చెప్పగలిగారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే, ఎంతో ఉత్కంఠతో సాగిపోయే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే.

ఇక నేను చదివిన మరో మంచి పుస్తకం, “స్వామి వివేకానందుడు” చే రచింపబడిన “రాజ యోగ” అనే ఆంగ్ల పుస్తకం. రాజయోగంలోని ముఖ్యభాగాలైన యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధిలను గురించి క్లుప్తంగా, అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరింపబడింది. వెన్నుముక దిగువభాగంలో, మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉండే కుండలినీ శక్తి గురించి, ఆ శక్తిని మెదడులో వేయి రేకులతో వికసించే పద్మాన్ని పోలివుండే సహస్రార చక్రానికి తీసుకుపోయే ఇడ, పింగళ నాడుల గురించి, ఆ క్రమంలో జరిగే పరిణామాల గురించీ చక్కగా వివరించారు. మనిషి బయట చూసే ప్రపంచానికన్నా విశాలమైన ప్రపంచం మనిషి లోపల కూడా ఉందనీ, రాజయోగ సాధన ద్వారా ఆ ప్రపంచాన్ని చూడవచ్చనీ, దానికి సాధన ఎంతో ముఖ్యమనీ వివరింపబడింది. సైన్స్‌కీ, అధ్యాత్మికతకూ ముఖ్య భేదాన్ని కూడా వివేకానందుడు చక్కగా వివరించాడు. నిరూపింపబడేంతవరకూ దేనినీ నమ్మదు సైన్స్. కానీ, ముందు నమ్మకం ఉంచితే, నిజం నీకే అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది ఆధ్యాత్మికత. ఈ పుస్తకంలో చెప్పినవి మన అనుభవంలోకి రావాలంటే ఎన్నో సంవత్సరాల సాధన అవసరం. అది ఈ బిజీ జీవితంలో ఎంతవరకూ సాధ్యమో తెలియదుగానీ, ప్రతీ వ్యక్తీ కనీసం ఒకసారి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. తీరిక దొరికినప్పుడు తప్పక చదవండి.