కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

ఎవరినైనా “నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఏవి..?” అని ప్రశ్నిస్తే, చాలామంది చెప్పే సమాధానం “కాలేజీ రోజులు” అనే. అదే ఆ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఆ అనుభూతులే ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే రెండున్నర గంటల సినిమాగా మలచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

కథ విషయానికి వస్తే, నాలుగు జంటల ఇంజనీరింగ్ కాలేజీ  అనుభవాలే “హ్యాపీ డేస్”. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు రోజూ ఎదురయ్యే అన్ని అనుభవాలనీ రంగరించి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. కాలేజీ తొలినాళ్ళలో ఎదురయ్యే ర్యాగింగ్ అనుభవాలు, పొగరుగా ప్రవర్తించే జూనియర్ల కొమ్ములు వంచే సీనియర్లు, కొత్త పరిచయాలు, ఫ్రెషర్స్ పార్టీ, సంవత్సరమంతా ఎంజాయ్ చేసి చివర్లో నైట్అవుట్‌లతో, కాపీలతో గట్టెక్కే విద్యార్థులు, ఆ వయస్సులో క్లాస్‌మేట్, సీనియర్, లెక్చరర్ అన్న బేధం లేకుండా ఆపోజిట్ సెక్స్ పై కలిగే ఆకర్షణ, ప్రేమ, స్నేహితుల మధ్య చిన్న చిన్న పంతాలు, పట్టింపులు, కష్టసుఖాలను పంచుకోవడం, చివరిగా ఫేర్‌వెల్ పార్టీ సమయానికి కళ్ళు చెమర్చడం.. ఇలాంటి అన్ని అనుభవాలకు దృశ్యరూపమే “హ్యాపీ డేస్”.

ఈ సినిమాలోని నటీనటులందరూ కొత్తవారే. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకుగా నటించిన “రాజేష్” పాత్రధారి నటనలో ఈజ్ బావుంది. సీనియర్ అమ్మాయి “స్రవంతి” కూడా భావాలను బాగా ప్రదర్శించింది. కమలినీ ముఖర్జీ ఒక యంగ్ లెక్చరర్‌గా తళుక్కుమంది. విద్యార్థులకు యంగ్ లేడీ లెక్చరర్లపై ఉండే ఆకర్షణను మోతాదు మించకుండా చిత్రీకరించడం, ఆ లెక్చరర్ పాత్రకు కమలినీను ఎన్నుకోవడం శెఖర్ కమ్ముల పరిణతిని చూపించింది. సినిమాలో కమెడియన్లు ఎవ్వరూ లేకపోయినా, శేఖర్ కమ్ముల రాసిన సంభాషణలు, ప్రేక్షకుల పెదవులమీద చిన్న చిరునవ్వును మొదటినుంచీ చివరివరకూ చెరగకుండా చేసాయి.

ఇక సంగీతం విషయానికి వస్తే, రాధాకృష్ణన్‌ను కాక, మిక్కీ జీ మేయర్‌ను ఎంచుకొని దర్శకుడు మంచిపని చేసాడనిపించింది. పాటలన్నీ శ్రావ్యంగా ఉండడమే కాక, చిత్రీకరణపరంగా కూడా బాగున్నాయి.

ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన గురించి చెప్పాలి. చిరంజీవి కొడుకు నటించిన “చిరుత” కూడా ఇదే సమయంలో విడుదల అవటంచేత ఈ సినిమా థియేటర్ ఖాళీగా ఉంటుందని ఊహించిన నా అంచనా తప్పయ్యింది. బారులు తీరిన క్యూచివర్లో నుంచుని, ముందునుంచి రెండో వరుసలో కూర్చొని, సినిమా చూడవలసి వచ్చింది 🙂 సినిమా సాగుతున్నంత సేఫూ జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేసారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న ఆదరణ ఈ చిత్రంతో మరోసారి రుజువయ్యింది.

వ్యక్తిగతంగా చూస్తే, నాకు “ఆనంద్”, “గోదావరి” చిత్రాలకన్నా ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బావున్నట్టు అనింపించింది. సినిమాలో కథ ఏమీ లేకుండా రెండున్నర గంటలు నడపడమంటే కత్తిమీద సామే. ఈ సినిమాలో కూడా కొన్ని అవసరం లేని సన్నివేశాలు, సాగదీయబడిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే ఈ సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా చూడచ్చు.

తెలుగులో ఈ మధ్యకాలంలో కాలేజీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు రాలేదు.  “హృదయం”, “ప్రేమదేశం” లాంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలయినా ఎంత సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులందరూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అయినా తమని తాము అయిడెంటిఫై చేసుకొంటే, ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట

మా చిన్నతనంలో ఇష్టపడి ఆడిన మరొక ఆట: ఏడు ఫెంకులాట. నా ఏడో తరగతి సమయంలో క్రికెట్ పిచ్చి తగులుకోక ముందు వరకూ ఈ ఆట ఆడడానికి ఎంతో ఉత్సాహపడే వాళ్ళం. ఈ ఆటని మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం వెనుక ఉన్న ఖాళీస్థలం లో ఆడేవాళ్ళం. ఈ ఆట గురించి పరిచయం లేని వారి గురించి కొంచెం వివరిస్తాను.

ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. టాస్ అంటే బొమ్మ-బొరుసు అనుకొనేరు. అంత సీనేం లేదు. అప్పట్లో ఈడ్చి తంతే మా జేబులోంచి ఒక్క పైసా కూడా రాలేది కాదు. అందుకే, ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి టాస్ వేసేవాళ్ళం. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు. ఈ టాస్ ను వేయడానికి మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మరెప్పుడైనా వివరిస్తాను.

ఇక ఆట విషయానికొస్తే, టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

బంతితో ఒకరిని కొట్టినప్పుడు అవతలి వ్యక్తి దానిని మోచేతులతో లేదా మోకాళ్ళతో అడ్డుకోవచ్చు. ఈ భాగాలలో బంతి తగిలినా లెక్కలోకి రాదు. పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది. ఈ ఆట ఆడి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, తలచుకొంటే ఇప్పటికీ ఆ చప్పట్లు చెవిలో రింగుమంటుంటాయి..!!

     

ఒంటరితనం

మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.

లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.

అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.

సల్మాన్ కు ఫత్వా..!!

నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు కాకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రామసేతు విషయంలో రేగిన దుమారం అందరికీ తెలిసిందే. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా, కనీసం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా పరిగణించి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది. ఇలాంటి అద్భుతమే ఏ అమెరికాలోనో ఉంటే ఈ పాటికి ఏ సబ్‌మెరైన్లలోనో పర్యాటకులను తిప్పి చూపించి ప్రపంచ ప్రాచుర్యం కల్పించేవారు. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని నాలుగు మాడ వీధులలోనూ ప్రతిష్ఠించాలనుకొంటున్న స్థంభాల నమూనాను టివిలో చూసాను. అది చూడడానికి అచ్చు శిలువ ఆకారంలో ఉంది. పైన ఎన్ని లతలను, నగిషీలను చెక్కినా దాని సహజ ఆకారం ఎక్కడికి పోతుంది..? టిటిడి వారు మాత్రం ఈ స్థంభాలు విజయనగరం కాలం నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేస్తున్నామనీ, దీనిని విమర్శించడం తగదనీ సమర్ధించుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొత్తం మీద, తమ మతాలను పరిరక్షించుకొనే విషయంలోముస్లిములది అతివృష్టి అయితే, హిందువుల పరిస్థితి అనావృష్టిగా తయారయింది. 

చిన్ననాటి ఆటలు: సబ్జా – విండూర్

నేను నా బ్లాగులో టపా వేసి వారం కావస్తోంది. తరువాత ఏమి రాద్దామా అని ఆలోచిస్తూండగా, నా చిన్నతనంలో మేమాడుకొన్న ఆటల గురించి రాస్తే బాగుంటుందనిపించింది. ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన ఈ ఆటల గురించి ఒక్క టపాలో రాస్తే సరిపోదనిపించింది. అందుకే ప్రతీ వారం ఒక్కొక్క ఆటని గుర్తు చేసుకొంటూ, ఆ జ్ఞాపకాలను ఈ బ్లాగులో పదిలంగా దాచుకోవాలని, తోటి బ్లాగు స్నేహితులతో  పంచుకోవాలని నిర్ణయించుకొన్నాను.

సాధారణంగా, మేమాడిన ప్రతీ ఆటలోనూ, క్రీడాకారులనుంచి ఒక “దొంగ” ను ఎన్నుకోవడం ఉండేది. “దొంగ” ను “పంటలు” అనే పద్ధతి ద్వారా ఎన్నుకొనేవాళ్ళం. ముగ్గురు లేదా అయిదుగురం ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకొని వృత్తాకారంలో నించుని అందరూ ఒకేసారి ఎవరి ఎడం అరచేతిలో వారి కుడి అరచేతిని, వెల్లకిలాగానీ, బోర్లాగానీ, ఎవరికి తోచినట్లు వారు ఉంచేవాళ్ళం. ముగ్గురిలో ఒకేలా వేసిన ఇద్దరు కాక మిగిలిన వారు “పంట” అయినట్టు. అదే విధంగా అయిదుగురిలో ఒకేలా వేసిన ఇద్దరు పంట అయినట్టు. చివరకు పంట కాకుండా మిగిలిన వారే దొంగ. ఒకవేళ ఇద్దరు మిగిలితే, అప్పటికే పంట అయిన వారు తోడుకు వచ్చేవారు.

ఇక నాకు చాలా ఇష్టమైన ఆటల్లో మొదటిది “సబ్జా – విండూర్”. పైన చెప్పిన విధంగా దొంగను ఎన్నుకొన్న తరువాత, దొంగ, కళ్ళు మూసుకొని అంకెలు లెక్కబెడతాడు. అతను కళ్ళు తెరిచేలోపు, మిగిలిన అందరూ దొంగకు కనబడకుండా ఎక్కడైనా దాక్కోవాలి (కొన్ని సరిహద్దుల లోపల). దొంగ, దాక్కున్న ప్రతీ ఒక్కరినీ కనుక్కొని, వారి పేరు చెప్తూ “విండూర్” అని అరవాలి. ఈ లోపుగా ఎవరైనా దొంగ వెనుకగా వచ్చి “సబ్జా” అని ముట్టుకొంటే, దొంగ మరల ఆటను మొదలుపెట్టవలసి ఉంటుంది. అలా కాక, దొంగ అందరినీ కనుగొనగలిగితే, మొదటగా విండూర్ అయిన వ్యక్తి మరుసటి ఆటకు దొంగగా ఉండవలసి వస్తుంది.

ఈ ఆటను నా ఎదురింటి స్నేహితుడు”కృష్ణ” ఇంటి పెరడులో ఆడేవాళ్ళం. దొంగకి దొరకకుండా ఉండడానికి, ధాన్యం గాదెలోనో, లేక గడ్డి మేటిలోనో దాక్కునే వాళ్ళం. ఆ దెబ్బకి ఒళ్ళంతా దురదలు వచ్చినా పట్టించుకోనంతగా ఆటలో లీనమైపొయేవాళ్ళం. ఇక దొంగని తప్పుదారి పట్టించడానికి రకరకాల యుక్తులు ఉపయోగించేవాళ్ళం. ముఖ్యంగా నేనూ, కృష్ణా, ఒకరి చొక్కాలు మరొకరు మార్చేసుకొని, దొంగకి పట్టుబడ్డట్టుగా వెనుకనుంచి కనబడేవాళ్ళం. ఒకవేళ చొక్కా ఆనుమాలుతో మనిషి పేరు చెప్పాడా, అతను మళ్ళా దొంగ పెట్టవలసిందే..!!   ఇంతే కాక, పెరట్లో ఉన్న మరుగుదొడ్లలో దూరి తలుపేసుకొని, లోపల కుళాయి తిప్పి, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్లు దొంగని భ్రమింప చేసేవాళ్ళం. తలుపు సందులోంచి దొంగ యొక్క కదలికలు గమనిస్తూ, అదను చూసుకొని, హఠాత్తుగా దాడి చేసి సబ్జా చెప్పేవాళ్ళం. లేదా, ఒకేసారి ముగ్గురు నలుగురు దొంగపై దూకి ఉక్కిరిబిక్కిరి చేసి, అతను తేరుకొని విడిగా విండూర్ చెప్పేలోపే ఎవరో ఒకరు సబ్జా చెప్పేసే వాళ్ళం.

ఒకసారి ఈ ఆట మొదలుపెడితే అసలు సమయమే తెలిసేది కాదు. సాయంకాలం అయిదు గంటలకు మొదలుపెట్టిన ఆట, చీకటిపడి మా అమ్మలు కేకలు వేసి, చెవి మెలితిప్పి ఇంటికి లాక్కుపోయే దాకా సాగేది. అలసిపోయి, చెమటతో ముద్దైన వంటిపై, నూతి దగ్గిర చన్నీళ్ళ స్నానం చేసి, అన్నం తిని పడుకొంటే, మరుసటి రోజు ఉదయందాకా వళ్ళు తెలిసేది కాదు.

న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

నిన్ననే హైదరాబాద్‌లో జరిగిన ఫ్లైఓవర్ దారుణం టివిలో చూసాను. బాధితుల మృతదేహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. దానికంటే కలచివేసిన దృశ్యాలు ఏమిటంటే ఆ మృతదేహాలను కెమెరాలలో బంధించడానికి రిపోర్టర్లు పడుతున్న ఆతృత. జరిగిన దారుణాన్ని ఎంత తొందరగా ప్రసారం చేసి తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవాలనే ఆశ తప్ప, జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఒక చేయివేసి సాయం అందించాలనే తపన ఒక్కరిలోనూ కనబడలేదు. శిధిలాలలో మూల మూలలకు వెళ్ళి, తమ ప్రాణాలకు సైతం తెగించి, కాళ్ళు, చేతులు నలిగిన వారిని, తలలు చితికిన వారిని ఫొటోలలోనూ, వీడియోలలోనూ ప్రేతకళ ఉట్టిపడేలా చిత్రీకరించి పండుగ జరుపుకున్నారు మీడియా వారు. వీరికీ, శవాలను పీక్కు తినే రాబందులకు పెద్ద తేడా ఏముంది..? సంఘటన జరిగిన నాలుగు గంటలకు గానీ అధికార యంత్రాంగం స్పందించలేదని పత్రికలలో వచ్చింది. ఊరికి ముందరే సంఘటనా స్థలంలో ప్రత్యక్షమైపోయే మీడియా వారందరూ తలా ఒక చేయి వేసిఉంటే కొంతమంది ప్రాణాలయినా కాపాడగలిగే వారు కాదా..?

ఇలా బాధపడుతూ, కొంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ప్రతీ ఆదివారం జెమిని చానల్లో ప్రసారమయ్యే “అమృతం” అనే హాస్య ధారావాహిక చూద్దామని కూర్చున్నాను. సరిగా నా మనసులో ఉన్నదే ఆ ధారావాహిక లోని ముఖ్యాంశం. అందులో 24 గంటల పాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్ళ తీరుపై సునిశితమైన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చూసిన వెంటనే హాస్యం జనించినా, కొద్ది ఆలోచిస్తే, నిజమే కదా అని అనిపించేలా ఉన్నాయి అందులో సన్నివేశాలు. మచ్చుకు రెండు చెప్తాను.

“అమృతం”, “ఆంజనేయులు” ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు. ఒక రోడ్డుపై ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు చివరే ఒక పెద్ద లోయ. ఒక టివి ఛానల్ యాంకర్ అక్కడ కాపు కాచుకుని ఏ వాహనం ఆ మలుపు తీసుకొంటుందా అనిచూస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాహనం మలుపు తీసుకోవడం, ఆ లోయలో పడడం, ఆ యాంకర్, ప్రభుత్వాన్నీ, రోడ్డు మరియు భవనాల శాఖ పనితీరుని దుయ్యబడుతూ ఉండటం, ఇలా సాగిపోతూ ఉంటుంది ఆ ఛానల్లోని ప్రసారం. దీని బదులు “ఇటు వైపు పోరాదు” అని ఆ ఛానల్ వారే బోర్డు పెడితే బావుండేది కదా అని ఆక్రోశిస్తాడు అమృతం. 

మరో సన్నివేశంలో, ఒక రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి చేరుకొన్న ఒక న్యూస్ చానల్ వారు,అక్కడ కొన ఊపిరితో కొట్టుకొంటున్న ప్రయాణీకుడిని చూపి, “ఇతను మరణిస్తాడా..? లేదా..? మీ సమాధానం మాకు SMS చేయండి” అంటూ ఒక పోటీని నిర్వహిస్తారు. ఇది చూసి అమృతం నివ్వెర పోతాడు.

ఇలా ఎన్నో వ్యంగ్యాస్త్రాలతో సాగిపోయింది ఈ వారం “అమృతం” ధారావాహిక. నా మనసులోని భావాలను దృశ్యరూపంలో ఆవిష్కరించిన ఆ ధారావాహికా బృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే పెళ్ళాడుతా” లాంటి సినిమాలు విజయవంతమవడానికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్లు కూడా కామెడీ పండించడం. ఈ సినిమా కథ ప్రకారం దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, నవదీప్, రెండో హీరోయిన్ వేసిన వెర్రి వేషాలను కామెడీ అని భావించేంత సహృదయం నాకు లేదు.

ఇక ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం వివరిస్తాను. హీరోయిన్ కాజల్, హీరో నవదీప్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రాత్రి హీరోయిన్ తప్పతాగి హీరో ఇంట్లో నిద్ర పోతుంది. పొద్దున్న లేచి చూసేసరికి, వంటి మీద వేరే దుస్తులు ఉంటాయి. రాత్రి ఏం జరిగిందని అడిగితే, హీరో కొంటె నవ్వు నవ్వుతూ “ఏం జరిగిందో నీకు తెలియదా..?” అంటాడు. ఎక్కడో చూసినట్టుందికదూ..? “దిల్‌వాలే..”, “బావగారూ బాగున్నారా..” లాంటి సినిమాలనుండి అరగగొట్టి పారేసిన ఈ సీనే ఈ సినిమాలోని కీలక సన్నివేశం. దీన్ని బట్టి మిగిలిన కథ ఎంత గొప్పగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం సాగదీతగానే అనిపించింది. ప్రారంభంలో భారతదేశ గొప్పతనంపై వచ్చే సన్నివేశాలు, నాగబాబు కూతురు కాజల్ కి పెళ్ళికొడుకును వెతికే సన్నివేశాలు, నవదీఫ్ కాజల్‌ను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బతిమాలే సన్నివేశాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో..

ఇక ఈ సినిమా ముఖ్య విషయంలోనే లోపం ఉంది. హీరోయిన్ కాజల్, తండ్రికి జరిగిన విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదని తెలిసినా చివరివరకూ సా..గదీసి, క్లయిమాక్స్ లో చెప్పడం చూసి “ఇదేదో ముందే చెప్పి తగలడుంటే మాకీ మూడు గంటల నరకం తప్పేదిగా..” అని సగటు ప్రేక్షకుడు బాధ పడితే తప్పేమీ లేదు.

రొటీన్ తెలుగు సినిమాలలోలాగానే పతాక సన్నివేశంలో ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకొంటారో ఒక పెద్ద సస్పెన్సు అయినట్టు బిల్డప్పు, ఉన్నట్టుండి ఆహుతి ప్రసాద్ చిన్న సైజు విలన్‌గా మారిపోవడం, నాగబాబు ప్రేక్షకులు అందరివైపుకీ తిరిగి, ఆడపిల్లల మనస్తత్వం తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదంటూ క్లాసు పీకడం.. అన్నీ మూస సినిమాను తలపించాయి. ఉన్నంతలో శివ బాలాజీ, కాజల్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది.

ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయానికి వస్తే, ఇంతకంటే చెత్త సినిమాలు ఎన్నో (ఉదాహరణకు “వసంతం”, “లక్ష్మీ”, “నేనున్నాను” వంటివి) కుటుంబ, మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఘన చరిత్రను చూసాను కాబట్టి, ఈ విషయాన్ని కాలానికే వదిలేస్తున్నాను. కొసమెరపు ఏమిటంటే.. నాతో పాటూ సినిమాకు వచ్చిన నా భార్య “సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు కదా..” అని అనటం..!!

  

“చక్ దే ఇండియా..” – ఒక మంచి చిత్రం

నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత భావాలను చక్కగా పలికించాడు. ముఖ్యంగా అతని వయసుకు తగ్గ పాత్రలో రాణించాడు. గత కొన్ని చిత్రాలలో కొంత వయసు మీద పడ్డట్టు కనిపించినా, ఈ చిత్రంలో మాత్రం అందంగా కనిపించాడు. “స్వదేశ్” చిత్రం తరువాత ఇది అతనికి మరో మంచి చిత్రం అవుతుంది.

ఇక కథాంశానికి వస్తే, ప్రస్తుత భారతదేశ క్రీడాచిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిందీ చిత్రం. భారతదేశంలో క్రికెటేతర క్రీడలకు కరువవుతున్న ప్రోత్సాహం, ఆదరణ, ముఖ్యంగా జాతీయ క్రీడ “హాకీ” కి పట్టిన దుస్థితి, మహిళా క్రీడాకారులపై చులకనాభావం, సెలెక్షన్ ప్రక్రియలోని లోపాలు, బోర్డు సభ్యుల రాజకీయాలు, క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా కాక, రాష్ట్రాల వారీగా ఎంపిక చేయటం, మహిళలకు కుటుంబ సభ్యులనుండి, సమాజం నుండి తగిన ప్రోత్సాహం లేక పోవడం, క్రీడాకారులలో అనైక్యత, సమిష్టి తత్వం, పోరాట తత్వం కొరవడడం,  క్రికెట్ పై ఉన్న మోజు జనానికి ఇతర క్రీడలపై లేక పోవడం, క్రీడాకారులకు లభిస్తున్న అరకొర సదుపాయాలు, క్రీడాకారులు వ్యక్తిగత రికార్డులకై పాకులాడుతూ జట్టును నిర్లక్ష్యం చేయడం, క్రీడాకారులలో గ్రూపు తగాదాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, జాతీయ జట్టుకు ఎంపికైపోయాములే అన్న నిర్లక్ష్యం, అహంభావం, కోచింగ్ ప్రమాణాలు, క్రీడాకారులకు కావలసిన మంచి లక్షణాలైన సమన్వయం, అవగాహన, క్రీడలకు రాజకీయాలను, మతాన్నీ ముడి పెట్టడం , క్రీడలను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించడం, గెలిస్తే క్రీడాకారులను అందలం ఎక్కించటం, ఓడితే పాతాళానికి తోసివేయటం, ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్నో.. ఇన్ని అంశాలను స్పృశించినా, ఎక్కడా అసభ్యత, అశ్లీలత వంటి వాటికి తావీయకుండా, సాగదీయకుండా సంక్షిప్త మైన మాటలతో, మనసుకు హత్తుకొనే దృశ్యాలతో, మధురమైన, ఉత్తేజపూరితమైన నేపథ్య సంగీతంతో సినిమా సాగిపోయింది. ఇటువంటి చిత్రాన్ని తీసిన యూనిట్ సభ్యులందరూ అభినందనీయులు. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం “చక్ దే ఇండియా”.

గమనిక : ఇందులో భారత క్రికెట్ వైస్ కెప్టెన్ “అభిమన్యు సింగ్” పాత్ర, భారతీయ క్రికెటర్ “యువరాజ్ సింగ్” ను పోలివుండడం యాదృచ్చికం కాదనుకుంటాను.

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు.

కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” అని కొందరు అనువదించినా ఆ అనువాదము సంపూర్ణము కాదు. ఎందుకంటే పొగను విడిచే వాహనాలు ఎన్నో వున్నాయి. అదేవిధంగా ప్రతి సామాన్యుడికీ అర్ధమయ్యే రైలు అనే పదాన్ని పై విధంగా అనువదించటం కూడా సరి కాదు. అంతెందుకు..? మనం రోజూ చేసే బ్లాగింగు అనే ఆంగ్ల పదాన్ని అదే విధంగా తెలుగులో ఉపయోగించట్లేదా..? ఇంకా వాటిపై చమత్కార చణుకులు జల్లి, బ్లాగరి, బ్లాగర్లు, బ్లాగ్లోకం ఇలా ఎన్నో తెలుగులో లేని పదాలను సృష్టించుకున్నామే, మరి ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ లాంటి పదాలను అదే పేరుతో తెలుగులో ఉపయోగిస్తే తప్పేముంది..?

మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు. కానీ, అదే పనిగా ప్రతీ పరభాషా పదాన్నీ ముక్కలుగా తెగ్గోసి తెలుగులోకి అనువదించటం వల్ల బ్లాగులు సామాన్యుడికి అర్ధం కాని విధంగా తయారవుతాయని నా అభిప్రాయం. భారతీయ పదాలైన “యోగా”, “దేశీ”, “గురు” లాంటి వాటిని ఆంగ్లంలో ఉపయోగిస్తున్నప్పుడు “ఇంటర్‌నెట్” లాంటి పదాలను తెలుగులో అదే విధంగా వాడుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. అంతే తప్ప “వెబ్”ను “సాలెగూడు” గానూ “హార్డ్ డిస్క్” ను “కఠిన చట్రం” గానూ అనువదిస్తూపోతే తెలుగు బ్లాగులు హాస్యాస్పదంగా తయారవుతాయి. మరి మీరేమంటారు..?