చిర్రెత్తించిన “చిరుత”

ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు.

చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” అన్నట్లు ఏడవలేక వచ్చే నవ్వులు చాలాసార్లు వినిపించాయి.

కథ విషయానికి వస్తే, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడం, తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, పొగరుబోతు హీరోయిన్ తిక్క కుదిర్చి ప్రేమాయణం సాగించడం.. ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు..? కొడుకు కెరీర్‌ను శ్రద్ధగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, తన కొడుకు తొలి సినిమాకు ఇంత మూస కథను ఎన్నుకోవడం విచిత్రమే.

ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం పెద్ద మైనస్. పాటలు ఎక్కడా వినసొంపుగా లేవు. చిరంజీవి కొడుకు సినిమా కనుక పాటలు ఆ మాత్రం అన్నా పాపులర్ అయ్యాయి. చిరంజీవితో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ, ఈ చిత్రానికి ఇంత నాసిరకం సంగీతాన్ని అందించాడంటే ఆశ్చర్యమే. 

ఇక చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలందరికీ హీరోయిన్లను ఎన్నుకోవడంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల ఇటీవలి సినిమాలకు హీరోయిన్‌లు ఎంత మైనస్ అయ్యారో తెలిసిన విషయమే. అదే జాడ్యం ఈ సినిమాకూ పట్టుకొంది. ఒక్కోసారి హీరోయిన్‌ను మిగిలిన స్నేహితురాళ్ళతో కలిపి చూపిస్తే గుర్తించడమే కష్టం అయ్యింది.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, ఎంత చెత్త సినిమానైనా “ఏరా”, “ఒరే”, “ఏమ్మా”, “పోమ్మా” లాంటి మాస్ పదాలతో లాగించేయచ్చనే కాన్‌ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది.  ఇందులోనూ హీరో, హీరోయిన్ల మధ్యన అతి సంభాషణా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాల్లో ఈ సంభాషణలు క్లిక్ అయినా, ప్రతీ సినిమాకీ అదే కొనసాగిస్తే ఎప్పుడో ప్రేక్షకులు తిప్పికొడతారన్న విషయం పూరీ గుర్తించాలి. అదే విధంగా క్లాస్ సినిమాగా తీయాలా, లేక మాస్‌ను ఆకర్షించాలా అనే విషయంలో కూడా పూరీ కన్‌ఫ్యూజన్ స్పష్టంగానే కనిపించిపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ కొన్నిచోట్ల “సూపర్” సినిమాను తలపించింది. ముఖ్యంగా వాటర్ స్కూటర్ ఫైట్ అయితే “సూపర్” క్లైమాక్స్ సన్నివేశాన్నే గుర్తుకు తెచ్చింది.

ఈ సినిమాలో కొద్దో గొప్పో హాస్యం అంటే ఆలీ గూర్చే చెప్పుకోవాలి. “యు వాంట్ థాయ్ మస్సా..” అంటూ పర్యాటకులను మసాజ్‌తో ఆకట్టుకొనే ఆడ బ్రోకర్ పాత్రను పోషించాడు. ఆలీకి ఆడవేషం కొత్త కాకపోయినా, సాధ్యమైనంత వరకూ కొత్త మేనరిజంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇక అమెరికాలో, చిరంజీవి ఇమేజ్‌ను సొమ్ముచేసుకోవడానికి టిక్కెట్టు రేటును 15 డాలర్లు చేయడం కోపం తెప్పించింది. ఈ మధ్య అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో రేట్లు కూడా బాగా గుంజి జనాలను దోచుకొంటున్నారు.

చివరిగా, రాంచరణ్ నటన ఫరవాలేదు. ఎక్కడా మొదటి సినిమా అన్న బెరకు కనిపించలేదు. డైలాగ్ డెలివరీ కొంత మెరగుపరచుకోవలసి ఉంది. డాన్స్‌లు, ఫైట్‌లు భాగా చేశాడు. కానీ, నటనలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల ఛాయలు కనిపించాయి. వాటిని పోగొట్టుకొని సొంత స్టైల్‌ను అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రాంచరణ్ రెండవ సినిమా రాజమౌళితోనట. హింస, అశ్లీలతలపై ఆధారపడి పబ్బం గడుపుకొనే రాజమౌళి చేతిలో పడితే మాస్ మూసలో పడి ఇతని భవిష్యత్ కొట్టుకుపోవడం ఖాయం. ఇటువంటి దర్శకులను ఎన్నుకొనేబదులు, కథాబలం గల సినిమాలు తీస్తూ టాలెంట్ పుష్కలంగా గల “శేఖర్ కమ్ముల”, “చంద్ర శేఖర్ యేలేటి”, “శేఖర్ సూరి”, “చంద్ర సిధ్ధార్థ” లాంటి దర్శకుల చేతిలో పడితే ఇతని భవిష్యత్‌కు ఇంకా ఉపకరిస్తుందని నా అభిప్రాయం.                 

సల్మాన్ కు ఫత్వా..!!

నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు కాకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రామసేతు విషయంలో రేగిన దుమారం అందరికీ తెలిసిందే. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా, కనీసం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా పరిగణించి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది. ఇలాంటి అద్భుతమే ఏ అమెరికాలోనో ఉంటే ఈ పాటికి ఏ సబ్‌మెరైన్లలోనో పర్యాటకులను తిప్పి చూపించి ప్రపంచ ప్రాచుర్యం కల్పించేవారు. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని నాలుగు మాడ వీధులలోనూ ప్రతిష్ఠించాలనుకొంటున్న స్థంభాల నమూనాను టివిలో చూసాను. అది చూడడానికి అచ్చు శిలువ ఆకారంలో ఉంది. పైన ఎన్ని లతలను, నగిషీలను చెక్కినా దాని సహజ ఆకారం ఎక్కడికి పోతుంది..? టిటిడి వారు మాత్రం ఈ స్థంభాలు విజయనగరం కాలం నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేస్తున్నామనీ, దీనిని విమర్శించడం తగదనీ సమర్ధించుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొత్తం మీద, తమ మతాలను పరిరక్షించుకొనే విషయంలోముస్లిములది అతివృష్టి అయితే, హిందువుల పరిస్థితి అనావృష్టిగా తయారయింది. 

న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

నిన్ననే హైదరాబాద్‌లో జరిగిన ఫ్లైఓవర్ దారుణం టివిలో చూసాను. బాధితుల మృతదేహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. దానికంటే కలచివేసిన దృశ్యాలు ఏమిటంటే ఆ మృతదేహాలను కెమెరాలలో బంధించడానికి రిపోర్టర్లు పడుతున్న ఆతృత. జరిగిన దారుణాన్ని ఎంత తొందరగా ప్రసారం చేసి తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవాలనే ఆశ తప్ప, జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఒక చేయివేసి సాయం అందించాలనే తపన ఒక్కరిలోనూ కనబడలేదు. శిధిలాలలో మూల మూలలకు వెళ్ళి, తమ ప్రాణాలకు సైతం తెగించి, కాళ్ళు, చేతులు నలిగిన వారిని, తలలు చితికిన వారిని ఫొటోలలోనూ, వీడియోలలోనూ ప్రేతకళ ఉట్టిపడేలా చిత్రీకరించి పండుగ జరుపుకున్నారు మీడియా వారు. వీరికీ, శవాలను పీక్కు తినే రాబందులకు పెద్ద తేడా ఏముంది..? సంఘటన జరిగిన నాలుగు గంటలకు గానీ అధికార యంత్రాంగం స్పందించలేదని పత్రికలలో వచ్చింది. ఊరికి ముందరే సంఘటనా స్థలంలో ప్రత్యక్షమైపోయే మీడియా వారందరూ తలా ఒక చేయి వేసిఉంటే కొంతమంది ప్రాణాలయినా కాపాడగలిగే వారు కాదా..?

ఇలా బాధపడుతూ, కొంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ప్రతీ ఆదివారం జెమిని చానల్లో ప్రసారమయ్యే “అమృతం” అనే హాస్య ధారావాహిక చూద్దామని కూర్చున్నాను. సరిగా నా మనసులో ఉన్నదే ఆ ధారావాహిక లోని ముఖ్యాంశం. అందులో 24 గంటల పాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్ళ తీరుపై సునిశితమైన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చూసిన వెంటనే హాస్యం జనించినా, కొద్ది ఆలోచిస్తే, నిజమే కదా అని అనిపించేలా ఉన్నాయి అందులో సన్నివేశాలు. మచ్చుకు రెండు చెప్తాను.

“అమృతం”, “ఆంజనేయులు” ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు. ఒక రోడ్డుపై ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు చివరే ఒక పెద్ద లోయ. ఒక టివి ఛానల్ యాంకర్ అక్కడ కాపు కాచుకుని ఏ వాహనం ఆ మలుపు తీసుకొంటుందా అనిచూస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాహనం మలుపు తీసుకోవడం, ఆ లోయలో పడడం, ఆ యాంకర్, ప్రభుత్వాన్నీ, రోడ్డు మరియు భవనాల శాఖ పనితీరుని దుయ్యబడుతూ ఉండటం, ఇలా సాగిపోతూ ఉంటుంది ఆ ఛానల్లోని ప్రసారం. దీని బదులు “ఇటు వైపు పోరాదు” అని ఆ ఛానల్ వారే బోర్డు పెడితే బావుండేది కదా అని ఆక్రోశిస్తాడు అమృతం. 

మరో సన్నివేశంలో, ఒక రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి చేరుకొన్న ఒక న్యూస్ చానల్ వారు,అక్కడ కొన ఊపిరితో కొట్టుకొంటున్న ప్రయాణీకుడిని చూపి, “ఇతను మరణిస్తాడా..? లేదా..? మీ సమాధానం మాకు SMS చేయండి” అంటూ ఒక పోటీని నిర్వహిస్తారు. ఇది చూసి అమృతం నివ్వెర పోతాడు.

ఇలా ఎన్నో వ్యంగ్యాస్త్రాలతో సాగిపోయింది ఈ వారం “అమృతం” ధారావాహిక. నా మనసులోని భావాలను దృశ్యరూపంలో ఆవిష్కరించిన ఆ ధారావాహికా బృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే పెళ్ళాడుతా” లాంటి సినిమాలు విజయవంతమవడానికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్లు కూడా కామెడీ పండించడం. ఈ సినిమా కథ ప్రకారం దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, నవదీప్, రెండో హీరోయిన్ వేసిన వెర్రి వేషాలను కామెడీ అని భావించేంత సహృదయం నాకు లేదు.

ఇక ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం వివరిస్తాను. హీరోయిన్ కాజల్, హీరో నవదీప్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రాత్రి హీరోయిన్ తప్పతాగి హీరో ఇంట్లో నిద్ర పోతుంది. పొద్దున్న లేచి చూసేసరికి, వంటి మీద వేరే దుస్తులు ఉంటాయి. రాత్రి ఏం జరిగిందని అడిగితే, హీరో కొంటె నవ్వు నవ్వుతూ “ఏం జరిగిందో నీకు తెలియదా..?” అంటాడు. ఎక్కడో చూసినట్టుందికదూ..? “దిల్‌వాలే..”, “బావగారూ బాగున్నారా..” లాంటి సినిమాలనుండి అరగగొట్టి పారేసిన ఈ సీనే ఈ సినిమాలోని కీలక సన్నివేశం. దీన్ని బట్టి మిగిలిన కథ ఎంత గొప్పగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం సాగదీతగానే అనిపించింది. ప్రారంభంలో భారతదేశ గొప్పతనంపై వచ్చే సన్నివేశాలు, నాగబాబు కూతురు కాజల్ కి పెళ్ళికొడుకును వెతికే సన్నివేశాలు, నవదీఫ్ కాజల్‌ను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బతిమాలే సన్నివేశాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో..

ఇక ఈ సినిమా ముఖ్య విషయంలోనే లోపం ఉంది. హీరోయిన్ కాజల్, తండ్రికి జరిగిన విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదని తెలిసినా చివరివరకూ సా..గదీసి, క్లయిమాక్స్ లో చెప్పడం చూసి “ఇదేదో ముందే చెప్పి తగలడుంటే మాకీ మూడు గంటల నరకం తప్పేదిగా..” అని సగటు ప్రేక్షకుడు బాధ పడితే తప్పేమీ లేదు.

రొటీన్ తెలుగు సినిమాలలోలాగానే పతాక సన్నివేశంలో ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకొంటారో ఒక పెద్ద సస్పెన్సు అయినట్టు బిల్డప్పు, ఉన్నట్టుండి ఆహుతి ప్రసాద్ చిన్న సైజు విలన్‌గా మారిపోవడం, నాగబాబు ప్రేక్షకులు అందరివైపుకీ తిరిగి, ఆడపిల్లల మనస్తత్వం తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదంటూ క్లాసు పీకడం.. అన్నీ మూస సినిమాను తలపించాయి. ఉన్నంతలో శివ బాలాజీ, కాజల్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది.

ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయానికి వస్తే, ఇంతకంటే చెత్త సినిమాలు ఎన్నో (ఉదాహరణకు “వసంతం”, “లక్ష్మీ”, “నేనున్నాను” వంటివి) కుటుంబ, మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఘన చరిత్రను చూసాను కాబట్టి, ఈ విషయాన్ని కాలానికే వదిలేస్తున్నాను. కొసమెరపు ఏమిటంటే.. నాతో పాటూ సినిమాకు వచ్చిన నా భార్య “సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు కదా..” అని అనటం..!!

  

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు.

కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” అని కొందరు అనువదించినా ఆ అనువాదము సంపూర్ణము కాదు. ఎందుకంటే పొగను విడిచే వాహనాలు ఎన్నో వున్నాయి. అదేవిధంగా ప్రతి సామాన్యుడికీ అర్ధమయ్యే రైలు అనే పదాన్ని పై విధంగా అనువదించటం కూడా సరి కాదు. అంతెందుకు..? మనం రోజూ చేసే బ్లాగింగు అనే ఆంగ్ల పదాన్ని అదే విధంగా తెలుగులో ఉపయోగించట్లేదా..? ఇంకా వాటిపై చమత్కార చణుకులు జల్లి, బ్లాగరి, బ్లాగర్లు, బ్లాగ్లోకం ఇలా ఎన్నో తెలుగులో లేని పదాలను సృష్టించుకున్నామే, మరి ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ లాంటి పదాలను అదే పేరుతో తెలుగులో ఉపయోగిస్తే తప్పేముంది..?

మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు. కానీ, అదే పనిగా ప్రతీ పరభాషా పదాన్నీ ముక్కలుగా తెగ్గోసి తెలుగులోకి అనువదించటం వల్ల బ్లాగులు సామాన్యుడికి అర్ధం కాని విధంగా తయారవుతాయని నా అభిప్రాయం. భారతీయ పదాలైన “యోగా”, “దేశీ”, “గురు” లాంటి వాటిని ఆంగ్లంలో ఉపయోగిస్తున్నప్పుడు “ఇంటర్‌నెట్” లాంటి పదాలను తెలుగులో అదే విధంగా వాడుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. అంతే తప్ప “వెబ్”ను “సాలెగూడు” గానూ “హార్డ్ డిస్క్” ను “కఠిన చట్రం” గానూ అనువదిస్తూపోతే తెలుగు బ్లాగులు హాస్యాస్పదంగా తయారవుతాయి. మరి మీరేమంటారు..? 

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను.

మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను.

“యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో ని హతమార్చడానికి కొందరు పథకం వేస్తే, ఇందులోనూ అంతే. పోతే అందులో చిత్రగుప్తుడి పొరబాటు వల్ల హీరో నరకానికి కొనిరాబడితే, ఇక్కడ పగ తీర్చుకోవడానికి యముడి ఆజ్ఞ పైన కొనిరాబడతాడు. అక్కడ రెండవ చిరంజీవి అమాయకుడు. అతనికి 21 సంవత్సరాలు నిండాక ఆస్తిపై తమ హక్కును కోల్పోతామని గ్రహించి విష ప్రయోగంతో హత్య చేస్తారు అతని బంధువులు. ఈ సినిమాలో రెండవ చిరంజీవి పాత్రను ప్రియమణి పోషించింది. ఈమె ఆస్తిపైనా బంధువులు పెత్తనం చెలాయిస్తుంటారు. ఒక్కోసారి కొరడాతో కూడా చావగొడతారు. ఆస్తి తమకే దక్కాలన్న స్వార్థంతో హత్యాయత్నం కూడా చేస్తారు. పోతే హీరో ఈ హత్యాయత్నాన్ని తెలియకుండా అడ్డుకోవడం, వారిద్దరి మధ్య ప్రేమ, ఇవన్నీ పైపై మెరుగులు. చివర్లో ఆమె బంధువులతో ఇంటిపనులు చేయించడం, అంట్లు తోమించడం ఇలా ఎన్నో పోలికలు. ఆ సినిమాలో చివర్లో చిరంజీవికి మరణం సంభవించబోతుంది. కాని యముడి ఆశీస్సులతో “చిరంజీవి” అవుతాడు.  ఈ సినిమాలోనూ రెండవ “యమగండం” పేరు చెప్పి హీరోను రెండవ మారు చంపడానికి ప్రయత్నిస్తాడు యముడు. ఇవన్నిటితో చూస్తే జ్యోతి గారన్నట్లు ఈ సినిమా “కొత్త సీసాలో పాత మందే”..!!

పోతే “యముడి కి మొగుడు” లో యముడి పాత్ర ఎంతో హుందాగా చిత్రీకరించబడింది. చిత్రగుప్తుడు చేసిన పొరపాటును దిద్దడానికి ధర్మపరిరక్షకుడైన యముడు అనుక్షణం పరితపిస్తాడు. ఇకపోతే “యమదొంగ” సినిమాలో యముడి పాత్రకు ఈర్ష్య, ద్వేషాలను ఆపాదించి కుటిలుడుగా చిత్రీకరించారు. పోతే మోహన్‌బాబు ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కుటిలత్వాన్ని బాగా ప్రదర్శించినా, అతని డైలాగ్ పవర్‌కి సరిపోయే మాటలు ఈ సినిమాలో లేవనే చెప్పాలి. ఇక చిత్రగుప్తుడి పాత్రను ఒక విటుడిలా చిత్రీకరించడం, భూలోకం నుంచి వచ్చిన వేశ్యతో కులకాలని చూడటం, అందుకు శిక్షలు మాఫీ చెయ్యడం లేదా తగ్గించడం, యమలోకాన్ని ఒక గవర్న్‌మెంట్ ఆఫీసుకన్నా హీనంగా, ఒక వ్యభిచార గృహం కంటే దారుణంగా చిత్రీకరించడం.. ఇవన్నీ హాస్యం ముసుగులో హిందూ దేవుళ్ళని కించపరచడమే. ఈ ఖర్మ హిందువులకేనేమో. వేరే ఏ మతం వారిపైనైనా ఇలాంటి దృశ్యాలను చిత్రీకరిస్తే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచి ఉండేది.

ఏది ఏమైనా మిగిలిన యమలోక సన్నివేశాలు కూడా యమగోల, యముడికి మొగుడు చిత్రాలను తలపించాయే తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. కేవలం డ్యాన్సు, ఫైట్లు, అసభ్యత, అశ్లీలత లను నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం డబ్బుతో జూదమాడటమే. స్టార్ కాస్టింగ్, గ్రాఫిక్స్‌లపై పెట్టిన శ్రద్ధ కథ, కథనం పై పెట్టి ఉంటే, N.T.R అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమా “సింహాద్రి” ని మించిన బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఈ విషయంలో మాత్రం రాజమౌళి N.T.R అభిమానులను నిరాశపరచినట్టే. 
 

జెమిని “చిత్ర” హింస..!!

రోజూ జెమిని ఛానల్లో డబ్బింగ్ సినిమాలనూ, సా..గదీత సీరియళ్ళనూ చూసి చూసీ విసుగు పుట్టి, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా మంచి కార్యక్రమాలు ఉండకపోతాయా అని ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ రోజు మొదటినుండీ చివరి వరకూ చలన చిత్రాలకు సంబంధించిన వేరు వేరు కార్యక్రమాలతో విచిత్ర రీతులలో “చిత్ర” హింసను కొనసాగించారు జెమిని వారు.

ఆగస్టు పదిహేను నాడే విడుదల అయిన “యమ దొంగ” చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. “సక్సెస్ దొంగ” కార్యక్రమంలో రాజమౌళి తో, “యమ ఆలీ” కార్యక్రమంలో N.T.R మరియు ఆలీ తోనూ ముఖాముఖి, తాను తీయబొయే కొత్త సినిమాలో తెలుగు నాయికకై అన్వేషణ అన్న సాకు చెప్పి తన సినిమాలకు ప్రచారం కల్పించుకొంటున్న దిల్ రాజు కార్యక్రమం “కొత్త బంగారు లోకం”, ఇటీవలే జరిగిన తానా వార్షికోత్సవ కార్యక్రమాలు, త్వరలో విడుదల కానున్న “యమ గోల” సినిమాపై శ్రీకాంత్ తో ముఖాముఖి.. ఇవండీ మన జెమిని వారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రసారం చేసిన “ప్రత్యేక” కార్యక్రమాలు..!!

వీటితో పాటుగా, నిర్లక్ష్యానికి మరణమే శిక్షగా ప్రబోధించే “అపరిచితుడు”, ఫ్యాక్షనిస్టుల ప్రతీకారాలతో నిండిపోయిన “యజ్ఞం”, భారత పాకిస్తాన్ మధ్య చిచ్చును సొమ్ము చేసుకొంటూ రూపొందించిన “ఖడ్గం”.. ఇవి ఆరోజు ప్రసారం అయిన చలన చిత్రాలు. ఆరోజు మొత్తం, స్వాతంత్ర్యానికి సంబంధించిన ఒక్క ప్రత్యేక కార్యక్రమం కూడా నాకు భూతద్దంతో వెతికినా కనిపించలేదు. అన్నట్లు మరచిపోయాను.. ఒక్క కార్యక్రమంలో మాత్రం “గాంధీ” గారు కనిపించారండోయ్..!! అదీ “శంకర్‌దాదా జిందాబాద్” చిత్ర ప్రచారానికై ఉద్దేశించిన కార్యక్రమంలో. ఇందులో కూడా సినిమా ప్రచారం చేసుకోవాలన్న కోరిక తప్ప, జనానికి గాంధీ గారిని మరోసారి గుర్తు చేద్దామన్న తపన కనపడలేదు. 

ఈ శాటిలైట్ ఛానళ్ళ వారు ప్రసారం చేయాలనుకొంటే మంచి కార్యక్రమాలెన్నో చేయవచ్చు. స్వాతంత్ర్య సమరయోధులతో ముఖాముఖి, ఆ సంగ్రామంలో వారి అనుభవాలు, ప్రస్తుతం పింఛన్లకై వారు ఎదుర్కొంటున్న కస్టాలు, మన స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, సిపాయిల తిరుగుబాటు, జలియన్‌వాలాబాగ్ దురంతం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణోద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సంగ్రామంలో గాంధీతో పాటుగా పోరాడిన భగత్ సింగ్, అల్లూరి, నేతాజీ వంటి విప్లవ వీరులు, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, ప్రకాశం పంతులు వంటి నాయకులు, ఇలా తలచుకొంటే ఎన్నో సంఘటనలపై లేదా ఎందరో వ్యక్తులపై “ప్రత్యేక” కార్యక్రమాలను ప్రసారం చేయవచ్చు. కాని అడ్వర్టైజ్‌మెంట్లతో వచ్చిపడే డబ్బుకు ఆశ పడి రోజంతా సీరియళ్ళతోనూ, సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలతోనూ నింపేస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రానంతవరకూ మనకీ “చిత్ర”హింస తప్పదు.   

బాబోయ్ భారత్ బజార్..!!

ఈ మధ్య అమెరికాలో సందు సందునా, గొందు గొందునా భారత్ బజార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకూ, వినియోగదారులను దోచుకొందుకు, అందినకాడికి లాభాలను దండుకొందుకు ప్రాధాన్యతనిస్తూ, నాణ్యమైన వస్తువులను అందివ్వాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి.

ఇటీవల నేనొక భారత సూపర్ మార్కెట్ కి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న సుహాసిని బొమ్మతో బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ కనిపించింది. తీరా తీసిచూస్తే అది 2005 లో తయారయిన కాఫీ పౌడర్. దానిపై Best Before 9 months from mfd date అని రాసి ఉంది. అంటే అది expire అయ్యి సంవత్సరం పైగా అయ్యిందన్నమాట. అప్పటినుంచీ నేను కొనే ప్రతి వస్తువుకూ expiry date చూడటం అలవాటు చేసుకొన్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే, ఈ సమస్య ఏ ఒక్క కాఫీ పౌడర్ కో మాత్రమే  సంబంధించిన విషయం కాదు. ఈ భారతీయ మార్కెట్లలో దొరికే చాలా వస్తువులు expire అయిపోయినవో, లేక ఒకటి లేదా రెండు నెలల్లో expire అవబోయేవో.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని వస్తువుల మీద expiry dates కూడా ముద్రించి లేకపోవడం. పచ్చళ్ళు, మ్యాగీ, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. ఆ మద్య Parle-G బిస్కట్ ప్యాకెట్లు డాలర్ కి పది అని కొనబోతే, వాటిలో చాలావరకు expire అయిపోయినవే. దీనిని బట్టి నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే, expire అయిన లేదా అవబోతున్న వస్తువులని ఇలా వదల్చుకొంటున్నారని.

వీటితో పాటుగా ప్రస్తావించుకోవలసినవి పాలు, పెరుగు, బ్రెడ్ వంటివి. ముఖ్యంగా బ్రెడ్ ఎంతో కాలం నిలువ ఉండదు. పట్టుమని పదిరోజులు కూడా నిలువ ఉండని ఈ బ్రెడ్ ను రోజుల తరబడి అమ్మడం నాకు తెలుసు. పోనీ కాయగూరలన్నా తాజాగా ఉంటాయా అంటే అదీ లేదు. ఎప్పుడో వారాంతంలో జనం తాకిడి ఎక్కువ ఉండంటంచే తాజాగా ఉంచుతారే తప్ప, వారం మధ్యలో వెడితే అన్నీ కుళ్ళిపోయిన కూరగాయలే..!! అదీకాక తాజా కూరగాయలని కుళ్ళినవాటితో కలిపి లాభాలు దండుకోవటానికి ప్రయత్నిస్తారు.

కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తాజాగా ఉండాలంటే కావలసినది మంచి cooling system. ఇది చాలా స్టోర్లలో లేదు. ఉన్నా సరిగా పని చేయదు. ఇటువంటి చోట్ల కొన్న పాలు, పెరుగు వంటివి expiry date వరకు పాడవకుండా ఉంటాయన్న గ్యారంటీ ఏముంది..? ఇలాంటి చోట్ల పాలు కొన్న ఎంతోమంది స్నేహితులకి అవి కాచగానే విరిగిపోవడం నాకు తెలుసు. అదే విధంగా పప్పుదినుసులు మొదలైనవి పురుగులు పట్టడమో, పాడైపోవడమో జరిగిన సందర్భాలు అనేకం. అమెరికన్ స్టోర్లలో దొరికే ప్రతి వస్తువునూ నాణ్యతతో ఉండాలని కోరుకొనే మనం, ఒకవేళ ఏ మాత్రం నాణ్యత లోపించినా ఆరునెలలైనా నిర్మొహమాటంగా తిరిగి వెనుకకు ఇచ్చి డబ్బును డిమాండ్ చేసే మనం, ఈ ఇండియన్ మార్కెట్లలో జరిగే ఆగడాలను నిలదీయడానికి మాత్రం వెనుకాడతాము, జంకుతాము.. ఎందుకు..? ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు.

ఇకపోతే ఈ ఇండియన్ స్టోర్లు జనాలను దోచుకొనే విధాలు అనేకం. వీరు విక్రయించే వస్తువులలో చాలావరకు వస్తువులు ఇండియా నుంచి దిగుమతి చేసుకొన్నవే. వీటిపై ఇండియా లోని వెల తప్ప, అమెరికా వెల ఉండదు. ఇక్కడి స్టోర్ల వాళ్ళు ఏది ముద్రిస్తే అది దాని వెల అయి కూర్చుంటుంది. ఇక పండుగలోస్తే వీరికి “పండుగే”..!! రాఖీ, వినాయక చవితి, ఉగాది లాంటి పండుగలకి ఇండియా నుంచి రాఖీలు, వినాయకుని బొమ్మలు, పాలవెల్లులు, వేపపువ్వు, మామిడాకులు వంటివి తెచ్చి ఆకాశాన్నంటే ధరలను నిర్ణయించి అమ్ముతారు. ఇక శ్రావణ శుక్రవారాలొచ్చాయంటే తమలపాకులు, కొబ్బరి కాయలను కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి.

ఈ మార్కెట్లలో పోనీ customer service అన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. ఏ వారాంతాంలో వెళ్ళినా ఆ మూల నించీ ఈ మూల వరకూ వరుసలో జనం. కూరగాయలు బిల్ చేసే విధానం మరీ దారుణం. కూరగాయలను వెయింగ్ మెషీన్ మీదనుంచి లాగి ఏదో మీటలు నొక్కి ఎంతో ఒకంత వెల టైప్ చేస్తారు. పోనీ బిల్ లో వెల సరిచూసుకొందామంటే ఆ బిల్ ను డీకోడ్ చేయటానికి ఏ software enginner సరిపోడు.

ఇక ఇండియాలో ఒక వస్తువుకు మరో వస్తువును ఉచితంగా ఇవ్వడం సహజం. ఉదాహరణకు కాఫీ పౌడర్ కు గ్లాసో, స్పూనో ఇవ్వటంలాంటివి. ఈ ఇండియన్ స్టోర్లలో మరీ దారుణంగా అలా ఉచితంగా వచ్చిన ఆ గ్లాసునీ, స్పూనునీ కూడా వెల నిర్ణయించి అమ్మడం నేను చూసాను.

ఇక వినియోగదారుడిని ఆకర్షించడానికి వీరు అనుసరించే మార్గాలు ఎన్నో.. $20 కొంటే 2% డిస్కౌంట్, $30 కొంటే 3% డిస్కౌంట్ అంటూ.. ఇవికాక ఉచిత DVDలనీ, పాయింట్లనీ ఇలా ఎన్నో.. ఈ కొసర్లకు ఆశ పడి, కుళ్ళిన కాయగూరలను, అవసరం ఉన్నా లేకున్నా అందిన వస్తువులను, cart లో వేసి బిల్ చేసే వాళ్ళను అనేకం చూసాను. DVD, వీడియో క్యాసట్ల విషయానికొస్తే ఈ స్టోర్లన్నీ పైరసీకు నిలయాలుగా మారిపోయాయి. మన కళ్ళెదురుగానే DVD నుంచీ క్యాసెట్ కు కాపీ చేసేస్తుంటారు.

కానీ, మన బలహీనతలతో ఆడుకొనే ఇలాంటి స్టోర్లను ప్రోత్సహించకూడదు. మనకు వారేదో ఉపకారం చేస్తున్నారన్న భ్రమనుండి బయటపడి, మనం లేనిదే వారు మనలేరన్న వాస్తవాన్ని గ్రహించాలి. మన సేవలకు ఏ విధమైన లోపం కలిగినా వెంటనే నిలదీయాలి. తాజా కాయగూరలకై రైతు బజార్లు (farmers market)లాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. మన లేదా మన కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పోలిస్తే ఆదా చేసే కొన్ని డాలర్లు లెక్కలోనివి కావన్న సత్యాన్ని గ్రహించాలి. అమెరికాలోని ప్రతి భారతీయుడూ కలసి రాకుంటే ఈ దోపిడీ బజార్లు మరింత పేట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్య గమనిక: ఈ టపాలో “భారత్ బజార్” అన్న పదం అన్ని భారతీయ సూపర్ మార్కెట్లనూ ఉద్దేశించి రాసినదే తప్ప, “భారత్ బజార్” అనబడే చెయిన్ మార్కెట్ ను మాత్రమే ఉద్దేశించి రాసినది కాదు.